నందిపేట్, నవంబర్ 6: ‘నాది అభివృద్ధి, సంక్షేమ మంత్రమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పదేండ్ల్లుగా యంత్రంలా పని చేస్తున్నానని అన్నారు. సోమవారం మండలంలోని లక్కంపల్లి, చీంరాజ్పల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డికి డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మహిళలు బోనాలు, వందలాది మంది యువకులు బైక్ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు. ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను జీవన్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలతో తనకున్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.
వందలాది మంది వెంట రాగా జీవన్రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్కు ఓటేయాలని, మళ్లీ తనను గెలిపించాలని కోరారు. అనంతరం నిర్వహించిన సభల్లో జీవన్రెడ్డి మాట్లాడుతూ తాను పదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి పథకం అమలు చేస్తామని, అర్హులైన వారికి రూ.400లకే సిలిండర్, తెల్ల రేషన్ కార్డున్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు. కేసీఆర్ తెచ్చిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాయని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తనన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.