రాజంపేట్, ఏప్రిల్ 11: కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి పథకాలు లేవని చెప్పారు. సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలమట్టం పెరిగి బోర్లు పుష్కలంగా పారుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాల అసత్య, అబద్ధాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో జరగని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, ప్రతి జీపీకి ట్రాక్టర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, క్రీడామైదానం వంటి సదుపాయాలతో పల్లెలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ హయాంలోనే గురుకులాల సంఖ్య పెరిగిందని, వైద్యరంగంలో మెరుగైన సేవలు అందుతున్నట్లు చెప్పారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుడిపై ఆర్థిక భారం మోపిందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం బాల్రాజ్ రెడ్డి, ఎంపీపీ లింగాల స్వరూపాకృష్ణమూర్తి, జడ్పీటీసీ కొండా హన్మాండ్లు, ఎస్ఎస్నగర్ జడ్పీటీసీ నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్గం సాయిరెడి ్డ, సీనియర్ నాయకులు నీరడి శంకర్, గడ్డం రాంరెడ్డి, నాగభూషణం, బాణాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.