బిచ్కుంద, ఏప్రిల్ 1: కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలని, గ్రామాల్లో సైనికుల్లా పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే షిండే, ఎమ్మెల్సీ విఠల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో వచ్చిన కార్యకర్తలతో వారు ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ..తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. లబ్ధిదారులతో ప్రతి కార్యకర్త మాట్లాడాలన్నారు. సంక్షేమ పథకాలు పొందినవారి జాబితాను తయారుచేయాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని, బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరాలని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రైతులు చెరువుల కింద పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషంగా ఉన్నప్పటికీ..కాంగ్రెస్, బీజేపీ నాయకులు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి జుక్కల్ నియోజకవర్గానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని కోరుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడంతో అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో అధిక సంఖ్యలో చేరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వారికి భయపడకుండా బీఆర్ఎస్ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. కార్యకర్తలపై ఈగ వాలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ సభ్యుడు భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, పత్లాపూర్ సర్పంచ్ అరుణ్, సొసైటీ చైర్మన్ బాలాజీ, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే
రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. పేదింటి కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం, గర్భిణులు, మహిళలకు న్యూట్రిషన్ కిట్లు, మహిళల పేరుపై రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో మహిళలకు దక్కిన గౌరవం ఇతర రాష్ర్టాల్లో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.
-కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషిచేయాల జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు కోరారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులతో మాట్లాడి బీఆర్ఎస్కు మద్దతు కోరాలని సూచించారు. సమైక్య పాలనలో పాలకులు వ్యవసాయం దండగా అని అన్నారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇవ్వడంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగల మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు అప్పుల తిప్పలు తప్పాయన్నారు.
-జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు