ఖలీల్వాడి, జనవరి 4 : ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలోని వర్ని చౌరస్తా వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు.
2047 వరకు దేశం వికసితం కావాలంటే మనమందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచార వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మానాయక్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ యు.నాగశ్రీనివాస్రావు, ఎన్వైకే జిల్లా కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ వెంకటభార్గవ నాయుడు, కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఎఫ్పీఏ రషీద్, ఎంటీఎస్ పోచయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.