ఖలీల్వాడి, మే 11 : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ కేంద్రంలో కుట్టుమిషన్లో శిక్షణ పొందిన 133 మంది మహిళలకు క్యాంప్ కార్యాలయంలో గురువారం కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు.
న్యాక్లో శిక్షణ పొందిన మహిళలు సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఇతరులకు ఉపాధి కల్పించాలని సూచించారు. నైపుణ్యం ఉంటే నే ఏ పనైనా చేయవచ్చన్నారు. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారు న్యాక్ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఐటీ హబ్ పక్కన నిర్మిస్తున్న న్యాక్ భవనం త్వరలో పూర్తవుతుందని, ఒకేసారి వందల మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. టైలరింగ్లో శిక్షణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, శివచరణ్, రాజేంద్రప్రసాద్, ముచ్కూర్ నవీన్, ప్యాట సంతోష్, న్యాక్ సహాయ సంచాలకుడు ప్రభాకర్, ఇన్స్ట్రక్టర్లు కవిత, సాయికృష్ణ, లక్ష్మీనర్సింహులు పాల్గొన్నారు.