ఖలీల్వాడి, అక్టోబర్ 18 : రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ నగరంలో 60 ఏండ్లులో జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామన్నారు.
కులమతాలకతీతంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. యువత భవిష్యత్తు కోసం ఐటీహబ్, న్యాక్ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. సీఎస్ఐ చర్చీకి రూ. 4కోట్లు, క్రిస్టియన్ శ్మశాన వాటికకు రూ. కోటి మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే సాగర్ పాల్గొన్నారు.