ఆర్మూర్, సెప్టెంబర్10; ట్యాంక్ బండ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్.. నీటి మధ్యలోని బుద్ధుడి విగ్రహం. అదే తరహాలో ఆర్మూర్ ప్రజలకు స్వల్ప కాలంలోనే మూడు మినీ ట్యాంక్ బండ్లు ప్రజలకు చేరువకానున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కృషితో పట్టణ పరిధిలోని మల్లారెడ్డి చెరువు, సిద్ధులగుట్ట ప్రాంతంలోని గూండ్ల చెరువు, పెర్కిట్ ఊర చెరువులు మినీట్యాంక్ బండ్లుగా రూపు దిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్మూర్ గుండ్ల చెరువులో 80శాతం పనులు పూర్తికాగా మరో 15రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది. మల్లారెడ్డి చెరువు కట్టపై సైతం 50శాతం పనులు పూర్తి కావచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మున్సిపల్ అధికారులు పనులను ముమ్మరం చేశారు. మరోవైపు ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత పెర్కిట్ చెరువు కట్టపై పనులను ప్రారంభించనున్నారు.
రూ.9కోట్లతో అభివృద్ధి….
మూడు మినీట్యాంక్ బండ్లను రూ.9కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. మల్లారెడ్డి చెరువు కట్టకు రూ. 3కోట్లు, గూండ్ల చెరువు కట్టకు రూ. 4కోట్లు, పెర్కిట్ ట్యాంక్ బండ్కు రూ.2కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇరిగేషన్ ఆధ్వర్యంలో చెరువులను శుభ్రం చేయనున్నారు. ట్యాంక్ బండ్లపై బీటీ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, సైకిలింగ్ ట్రాక్లు, బోటింగ్, పిల్లల పార్కు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా గూండ్ల చెరువులో వద్ద నీటి మధ్యలోని ఐలాండ్లో హోటల్ నిర్మాణం సైతం చేపట్టనున్నారు.
పట్టణ ప్రజల ఆసక్తి….
ఆర్మూర్ పట్టణంలో మూడు మినీట్యాంక్ బండ్ల నిర్మాణం జరుగుతుండడంతో పట్టణవాసులతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు నిర్మాణ పనులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మినీట్యాంక్ బండ్ల నిర్మాణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పూర్తయితే ఉదయం, సాయంత్రంతో పాటు సెలవు రోజుల్లో ఆహ్లాదం పంచనున్నాయని పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
ఆర్మూర్ పట్టణంలోని మినీట్యాంక్ బండ్ల నిర్మాణంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్మూర్ పట్టణంలోని ఈ మూడు మినీట్యాంక్ బండ్లు పర్యాటక శోభను సంతరించుకోనున్నాయి.