నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “రైల్వే ఓవర్ బ్రిడ్జిల విషయంలోనూ ఎంపీ అర్వింద్ అబద్ధాలు ఆడుతుండు. మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు బారాణా అయితే, కేంద్రానికి చారాణా కూడా లేదు. సీఎంను ఒప్పించి రూ.63 కోట్లు మంజూరు చేయించా. రాష్ట్ర ప్రభుత్వం తరపున జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. రైల్వే శాఖ చేయాల్సిన పని ఎక్కడిదక్కడే ఉంది. వాస్తవం ఇట్లుంటే, ఎంపీ అర్వింద్ మొన్న భీమ్గల్కు వచ్చి ఉల్టా మంత్రి ఏం చేస్తలేడంటూ నాపై నిందలు వేసిండు. అర్వింద్ ఇప్పటికైనా నిజం మాట్లాడు. పనులు కనబడతలేవా? నీకు దమ్ముంటే బోధన్, ఎడపల్లి, ఇందల్వాయి వద్ద ఆర్వోబీలు తీసుకురా?’
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంపీ అర్వింద్పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనే ఆలోచనే తప్ప, ప్రజలకు మేలు చేసే జ్ఞానం లేదంటూ విరుచుకుపడ్డారు. బాల్కొండ నియోజ కవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బెజ్జోర గ్రామంలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ తీరుపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) విషయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చేయని కృషి లేదని చెప్పుకొచ్చారు. మాధవనగర్ వద్ద నిర్మిస్తున్న ఆర్వో బీ నిర్మాణం అంశాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించి రూ.63కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఇందు లో కేంద్రం వాటా రూ.30కోట్లు ఉందన్నా రు. మొత్తం రూ.93కోట్ల ఆర్వోబీ పనుల్లో రెండు నెలలు గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టాల్సిన పనులు ప్రారంభమమైనట్లు తెలిపారు. ఈ విషయంలో అర్వింద్ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిగో ఆధారాలు…
2022లో మే 17న, జూలైలో, సెప్టెంబర్ 26న, నవంబర్ 23న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కేంద్రానికి సంధించిన లేఖలకు అందుకు ఆయా వర్గాల నుంచి వచ్చి న ప్రతిస్పందన లేఖలను మంత్రి మీడియాకు చూపించా రు. ఫలితంగానే అర్సపల్లి ఆర్వోబీ మంజూరైందని ఇదీ సంతోషదాయకమని పేర్కొన్నారు. దమ్ముంటే తాను ప్ర పోజల్ చేసిన మిగతా ఆర్వోబీలను ఈ ప్రాంత ఎంపీగా కేంద్రాన్ని ఒప్పించి మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
తిట్టడానికే పుట్టినవా?
ఎంపీ అర్వింద్ కేవలం తమను తిట్టడానికే పుట్టినట్లున్నాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బారాణా ఖర్చయితే.. కేంద్రానికి చారాణా కూడా లేదన్నారు. మొన్న భీమ్గల్కు వచ్చి.. ఏం చేస్తలేడంటూ ఉల్టా తనపై నిందలు వేయడం ఏంటంటూ ఎంపీపై వేముల మండిపడ్డారు. అర్వింద్ నిజం మాట్లాడాలని, పనులు కనబడతలేదా? అంటూ ప్రశ్నించారు. అర్వింద్ ఎంపీగా, తాను మంత్రిగా జిల్లాకు వీలైనన్ని ఎక్కువ ఆర్వోబీలు తీసుకువద్దామని, ప్రజలకు మాయమాటలు చెప్పొద్దని హెచ్చరించారు.