మెండోరా, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన 284వ జయంతిని పురస్క రించుకొని మండలంలోని నడిమి తండా గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జగదాంబ అమ్మవారు, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయంలో హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహరాజ్ గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని, గొప్ప ఆధ్యాత్మిక గురవని కొనియాడారు.
సేవాలాల్ ఆశయాలకనుగుణంగానే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. గిరిజనుల చిరకాల కోరిక మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని, 3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులు అయినట్లు తెలిపారు. వారి ఆత్మగౌరవాన్ని పెంచిన గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, బన్సీలాల్ పాల్గొన్నారు.