ధాన్యం అన్లోడింగ్ విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని.. ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలించేలా చూడాలన్నారు. సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి ధాన్యం సేకరణ, తరలింపు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్న ప్రాంతాల క్లస్టర్ అధికారులను మందలించారు. రైతు ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
ఖలీల్వాడి, మే 22: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రధానంగా రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటనే అన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. ఏ ఒక్క రైస్మిల్లు వద్ద కూడా జాప్యం జరగకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్తో కలిసి ధాన్యం సేకరణ పురోగతిపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, వాటి తరలింపు తదితర వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే 70 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని కలెక్టర్..మంత్రి దృష్టికి తెచ్చారు. గుండారంలోని జై గణేశ్ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, శ్రీకృష్ణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్తో పాటు పార్వతీ రైస్మిల్, ఆర్కే. మోడర్న్ రైస్మిల్, సిద్ధిరామేశ్వర రైస్మిల్, శ్రీరామ మోడర్న్ తదితర రైస్మిల్లుల వద్ద 48 గంటలకు పైగా ధాన్యం అన్లోడింగ్ జరగని వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని మంత్రి గుర్తించారు. సంబంధిత క్లస్టర్ల పరిధిలో పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)లను సమీక్షా సమావేశం నుంచే ఫోన్ ద్వారా సంప్రదించి అన్లోడింగ్లో జాప్యానికి గల కారణాలపై ఆరా తీశారు.
రెండు, మూడు రోజుల పాటు ధాన్యం అన్లోడింగ్ నిలిచిపోతే మీరేం చేస్తున్నారంటూ మంత్రి మందలించారు. రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. మంత్రి ఫోన్ ద్వారా సంప్రదించిన సమయంలో ముగ్గురు డీటీలు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చామని తెలుపగా.. క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ధాన్యం అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలని వారికి సూచించారు. ఇండ్ల నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకొని పర్యవేక్షక బాధ్యతలు కలిగి ఉన్న ప్రదేశాల్లోనే భోజనం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్లోడింగ్ ప్రక్రియలో జాప్యం జరగడానికి వీలు లేదని, అవసరమైన చోట హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏ ర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే ధా న్యం సేకరణ పూర్తయిన బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల పరిధిలో పని చేసిన హమాలీల సేవలను ధాన్యం అన్లోడింగ్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా పని చేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై వేటు వేసేందుకు వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ మొత్తంలో గోదాములను గుర్తించాలని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో వాహనాలు సమకూర్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీఎస్వో చంద్రప్రకాశ్, డీఆర్డీవో చందర్, మెప్మా పీడీ రాములు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ జగదీశ్, డీసీవో సింహాచలం, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.