కామారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించారు. రూ.5 3కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉదయం 11.20 గంటలకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఘనంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు, పుర ప్రజలు, కళాకారులు, మె కానిక్లు వందల సంఖ్యలో జాతీయ రహదారి పక్కన ని ర్మించిన స్వాగత తోరణం వద్దకు వచ్చారు. డీజే పాటలు, బ్యాండుమేళాలు, నృత్యాలతో అలరిస్తూ కేటీఆర్కు స్వాగ తం పలికారు. కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
గులాబీమయంగా పట్టణాలు..
కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలు గులాబీమయంగా మారా యి. కామారెడ్డి పట్టణంలో వందలాది మంది తరలిరాగా, వారందరినీ మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఆప్యాయంగా పలుకరించారు. ఎల్లారెడ్డి పట్టణంలో బైకులు, కార్లు, ప్రైవేటు వాహనాల్లో వేలాది మంది కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపించాయి.
బీఆర్ఎస్లో జోష్
కామారెడ్డి పట్టణంలో ప్రారంభోత్సవాలు, ఎల్లారెడ్డిలో జరిగిన భారీ బహిరంగసభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. కామారెడ్డి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఎంతో కృషి చేస్తున్నారని, సౌమ్యుడని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ను మంత్రి ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, కార్యకర్తలు, నాయకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొనడంతో వారి నుంచి మంచి స్పందన లభించింది. కేటీఆర్ పర్యటనతో పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొనగా, రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత కష్టపడాలని కార్యకర్తలు, నాయకులు చర్చించుకున్నారు.