నందిపేట్, నవంబర్ 18 : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మానిక్భండార్, నందిపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రెండు రోడ్షోలు సక్సెస్ అయ్యాయి. ఆయన పర్యటన గులాబీ శ్రేణులతోపాటు స్థానికుల్లో ఎంతో జోష్ నింపింది. రోడ్షోకు వచ్చిన మంత్రి హరీశ్రావుకు ప్రజలు బోనాలు, మంగళహారతులతో డప్పువాయిద్యాల మధ్య పటాకులు కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలకు చురుకలు వేస్తూనే ఇప్పటివరకు అమలు చేసిన పథకాలతో పాటు మ్యానిఫెస్టోలో రూపుదిద్దుకున్న కొత్త పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. రెండు చోట్ల సుమారు అరగంటకు పైగా సాగిన ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. మానిక్బండార్, నందిపేట్ రోడ్షోలకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు వేలాదిగా తరలివచ్చారు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. ప్రజల చప్పట్లు, ఈలలతో రోడ్డు షో ప్రాంగణమంతా మారుమోగింది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్రెడ్డి పేరులోనే విజయముందని, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు.
ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకున్న మంత్రి నిజామాబాద్లో పర్యటన ముగిసిన తర్వాత రోడ్డు గుండా మానిక్భండార్కు వచ్చారు. అక్కడి నుంచి నందిపేట్కు చేరుకున్నారు. రోడ్షో ముగిశాక వెళ్లేందకు ఆయన కోసం హెలికాప్టర్ నందిపేట్కు వచ్చింది. నందిపేట్ సెజ్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. నందిపేట్లో రోడ్షో ముగిసిన తర్వాత హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.