వేల్పూర్ , సెప్టెంబర్ 9: బాల్కొండ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి ఆసరా ఫౌండేషన్ సౌజన్యంతో ఈనెల 12న మండలంలోని లక్కోర గ్రామ సమీపంలో ఉన్న ఏఎన్జీ ఫంక్షన్హాలులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్మేళాతో స్థానిక యువత, విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనున్నది. జాబ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న యువత కొందరి మాయమాటలు విని మోసపోతున్నారు. నిరుద్యోగులను ఆసరా చేసుకొని జాబ్లు ఇప్పిస్తామని వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వివిధ కంపెనీలను ఒకేవేదికపైకి తీసుకువచ్చి వారి కంపెనీల్లో ఖాళీలను స్థానిక యువతతో భర్తీచేయడానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆసరా ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
జాబ్మేళాకు కంపెనీలు ఐటీ, సాఫ్ట్వేర్, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, టెక్నికల్, కోర్ జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హోటల్ మేనేజ్ మెంట్, నర్సింగ్, మార్కెటింగ్, లాజాస్టిక్స్, బీపీవో, కేపీఈ తదితర రంగాలకు సంబంధించిన సుమారు 70కి పైగా తరలిరానున్నాయి. వీటికి సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగాల కోసం నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 70 కంపెనీల్లో సుమారు నాలుగు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, బీటెక్, ఎంసీఏ, ఫార్మసీ తదితర కోర్సులు చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్న యువత దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతల ఆధారంగా కంపెనీల్లో ఉన్న అవకాశాలను జాబ్మేళాలో వివరించనున్నారు. ఇప్పటి వరకు 3800 మంది యువకులు జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకున్నారు. జాబ్ మేళాకు వచ్చే యువత ఎటువంటి ఫీజు లేకుండా, తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.లేదా 9490902168, 9100120691 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు.
నేను జాబ్ కోసం కొన్నిరోజుల నుంచి తిరుగుతున్నాను. ఈనెల 12న లక్కోరలోనే మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలుకొని దరఖాస్తు చేసుకున్నా. ఒకేచోటికి వివిధ కంపెనీలు రావడం అదృష్టంగా భావిస్తున్నా. జాబ్మేళాలో నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఉన్నా.
ఈ నెల 12న మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషం వేసింది. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు లక్కోరకు రావడం అభినందనీయం. జాబ్ మేళా ద్వారా ఈ ప్రాంతంలోని యువతకు ఎంతో మేలు జరుగనున్నది. మెగా జాబ్మేళా నిర్వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ధన్యవాదాలు.
-సుంకరి అనన్య, వేల్పూర్
ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం చాలా సంతోషం. . మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి తానే స్వయంగా ఏర్పాటు చేస్తున్న జాబ్మేళాతో ఎంతో మేలు చేకూరనున్నది. యువత మేలు కోసం కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
-రంజిత్, వేల్పూర్