Heart Attack | నిజామాబాద్ రూరల్: దంత వైద్య కోర్సును అభ్యసించడానికి కెనడా వెళ్లిన నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని హఠాన్మరణం చెందింది. విదేశాల్లో నైపుణ్యాన్ని సంపాదించి ప్రజలకు సేవలను అందించాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మల్కాపూర్(ఏ) గ్రామ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రెడ్డి కూతురు పూజితారెడ్డి(25) దంత వైద్య కోర్సు చదివేందుకు జనవరి 26వ తేదీన కెనడాకు వెళ్లింది. స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్న ఆమెకు పది రోజుల క్రితం గుండెనొప్పి వచ్చింది. స్నేహితులు ఆమెను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మృతదేహం సోమవారం ఉదయం మల్కాపూర్(ఏ) గ్రామానికి చేరుకోగా.. అంత్యక్రియలను నిర్వహించారు. వెంకట్రెడ్డికి కుమారుడు, కూతురు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. కూతురు మరణించడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు రోదించడం అక్కడున్న అందరినీ కలిచివేసింది. అంత్యక్రియల్లో సర్పంచ్ శేఖర్గౌడ్, ఎంపీటీసీ శాంతా సాయిలు, బీఆర్ఎస్ నాయకులు బాగారెడ్డి, అంకల గంగాధర్, శ్రీనివాస్రెడ్డి, గుండారం సొసైటీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.