ధర్పల్లి, డిసెంబర్ 4 : పల్లెలో పుట్టి.. మట్టిలో మాణిక్యంగా మెరిసింది జిల్లాకు చెందిన యువతి. చదువుకుంటూనే అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తూ బంగారు పతకాలతో ముందుకు సాగుతున్నది ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన తంకానే అంజీరాం-విమల దంపతుల కూతురు మౌనిక. ప్రాథమిక, ఉన్నత విద్య మండల కేంద్రంలోనే పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నది. చిన్నప్పటి నుంచే ఆటల్లో ఆమెకు ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించిన గురువులు ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ నేడు జిల్లాతోపాటు దేశం గర్వించేలా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
కోచ్ లతీఫుద్దీన్ ప్రోత్సాహంతో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి క్రీడల వరకు ఎదిగింది. జాతీయస్థాయిలో నిర్వహించిన క్రీడల్లో సైతం ప్రతిభ చాటడంతో అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైంది. మూడు నెలల క్రితం కశ్మీర్లో జరిగిన జాతీయస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆడిన మౌనికను అంతర్జాతీయ టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్కు ఎంపిక చేశారు.
రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి..
టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్కు తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక క్రీడాకారిణిగా మౌనిక గుర్తింపు తెచ్చుకున్నది. శ్రీలంకలో నిర్వహించిన ఏషియన్ టెన్నిస్బాల్ క్రికెట్ ఫెడరేషన్లో భారత జట్టు తరపున ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. భారత జట్టుకు గోల్డ్ మెడల్ సాధించడంతో మౌనికను గురువులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన మౌనిక ప్రతిభను మండల ప్రజలు కొనియాడారు.
జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సహకారం..
పల్లెలో పుట్టి ప్రత్యేకమైన టెన్నిస్బాల్ క్రికెట్లో రాణిస్తున్న మౌనికది పేద కుటుంబం. తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు భారత జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగతంగా ఖర్చుల భరించుకోలేని పరిస్థితి. ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతుంటే స్థానిక బీఆర్ఎస్ నాయకుడు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పీసు రాజ్పాల్ ద్వారా విషయం తెలుసుకున్న ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్.. మౌనిక క్రీడలకు స్పాన్సర్ చేశారు. ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆర్థిక ప్రోత్సాహం లభించడంతో ఉత్సాహంగా భారత జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని దేశమే గర్వించేలా విజయాన్ని అందించింది. భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించడంపై బాజిరెడ్డి జగన్ మౌనికను అభినందించారు.
మౌనిక విజయాలు..
2013-14: అండర్-17 పాఠశాల స్థాయిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ జట్టు తరపున ఆడారు.
భారత్ జట్టు తరఫున ఆడడం గర్వంగా ఉన్నది
శ్రీలంకలో నిర్వహించిన టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం గర్వంగా ఉంది. జట్టు విజయంలో నా పాత్ర కూడా ఉండడం జీవితంలో మర్చిపోలేని ఘట్టం. నా ప్రతిభను గుర్తించి చిన్నప్పటి నుంచి ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, గురువులు, కోచ్తోపాటు స్పాన్సర్షిప్ను అందించిన జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరి ఆశీస్సులతో దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్త్తా .
-మౌనిక