వినాయక్నగర్, మార్చి 18: తులంన్నర బంగారం కోసం నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు ఓ కసాయి కొడుకు. తీవ్ర గాయాలపాలైన ఆ మాతృమూర్తి దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన ముద్దం గంగామణి అనే వృద్ధురాలికి శ్రీనివాస్, ప్రవీణ్ ఇద్దరు సంతానం. గంగామణి పెద్ద కుమారుడైన శ్రీనివాస్ వద్ద ఉంటుంది. ఆదివారం సాయం త్రం ఆమె తన పెద్దకుమారుడి ఇంటి ఎదుట కూర్చొ ని ఉండగా చిన్న కొడుకు ప్రవీణ్ అక్కడికి వచ్చాడు.
ఆమె వద్ద ఉన్న తులంన్నర బంగారం ఇవ్వాలని నిలదీశాడు. తల్లి ఇవ్వబోనని చెప్పడంతో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ముఖం, తలపై కొట్టాడు. దీంతో వృద్ధురాలి కన్ను, ముఖం వాచిపోయి రక్తస్రావం అయ్యింది. ప్రతినెలా వచ్చే పింఛన్ డబ్బులు కూడా తనకే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమె మనువడు మనోజ్కు ఫోన్ చేసి సమాచారం అందించగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. దాడికి పాల్పడిన ప్రవీణ్పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు.