కామారెడ్డి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీసీ కుల వృత్తుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మన రాష్ర్టానికి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో వలసవచ్చి ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కామారెడ్డి నియోజకవర్గంలోని 300 మంది బీసీ లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున రూ. 3కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా జ్యోతిబాఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గొల్ల కుర్మలు, మత్స్యకారులకు సహకారం అందించడంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి గొర్రెలు, మత్స్య సంపద పెరిగిందన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. నియోజకవర్గం వారీగా ప్రతినెలా 300 మందికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మైనారిటీ వర్గాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం త్వరలో రూ. లక్ష సాయం అందిచనున్నదని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాననే సంతృప్తి ఉందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచి ఐదుసార్లు గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు.
లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టామని Collector Jiteshవీ పాటిల్ తెలిపారు. ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. విజయం సాధించినవారి సక్సెస్ స్టోరీలతో ప్రత్యేక సంచికను ప్రచురిస్తామన్నారు. రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ దశలవారీగా అందజేస్తామని తెలిపారు.
బీసీలకు ఇచ్చినట్లే త్వరలో ముస్లిం, క్రిస్టియన్లకు కూడా ప్రభుత్వం రూ.లక్ష సాయం అందించనున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలో అర్హులను ఎంపిక చేస్తారని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, పథకాల అమలులో ముందంజలో నిలిపారని అన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా బీసీలకు రూ.లక్ష సాయం అందించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను మద్దతుగా నిలువాలని కోరారు.
బీసీలకు రూ. లక్ష సాయం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సాయం అందుకున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బ్యాంకు లింకేజీ లేకుండా, నేరుగా వంద శాతం సబ్సిడీపై లక్ష రూపాయలు అందించడంపై సంతోషం వ్యక్తంచేశారు. మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావుతోపాటు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మాది చాకలి వృత్తి. చేతిలో డబ్బులేక బట్టలుతుకుతూ బతుకుతున్నం. ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తదని కలలో కూడా అనుకోలేదు. చేతికి చెక్కు వచ్చేదాకా నమ్మలేదు. ఈ పైసలతో ల్యాండ్రీ షాపు పెట్టుకుంటా.
-గంగాధర్, బండరామేశ్వరపల్లి
పేదలకు కేసీఆర్ సార్ దేవుడు. ఇచ్చిన మాట తప్పడు. రూ.లక్ష ఇస్తానన్నడు.. ఇచ్చిండు. లక్ష రూపాయలు ఇచ్చి మా కుటుంబానికి ఆసరాగా నిలిచిండు. వీటితో వ్యాపారం ప్రారంభించి కష్టాలనుంచి గట్టెక్కుతం. ఆపత్కాలంలో ఆదుకుంటున్న సర్కారుకు ధన్యవాదాలు
-అవుసుల జ్యోతి, లచ్చపేట
దరఖాస్తు చేసుకున్నప్పుడు డబ్బులు ఇస్తరో.. లేదో అనుకున్న. నెల రోజుల్లోనే చేతిలో లక్ష రూపాయల చెక్కు పెట్టిండ్రు. ఈ డబ్బుతో టైలర్ షాపును పెట్టుకుంటా. సీఎం, ఎమ్మెల్యే సార్లకు రుణపడి ఉంటా
-ఎం.రజిత, లింగాపూర్