పర్వతాలను అధిరోహించడం ఆషామాషీ కాదు. అవరోధాలుంటాయి. అడుగడుగునా అపాయాలు పొంచి ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఒంట్లో శక్తి, గుండెలో ధైర్యం ఉండాలి. కఠోర సాధన చేయాలి. వీటన్నింటితోపాటు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని.. కష్టనష్టాలకోర్చి ఎత్తైన శిఖరాన్ని అవలీలగా అధిరోహించి ఇందూరు కీర్తినిచాటాడు మారుతి. ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు.
నిజామాబాద్ స్పోర్ట్స్, సెప్టెంబర్ 9: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ మారుతి చిన్నతనం నుంచి పర్వతాలను అధిరోహించాలని కలగనేవాడు. ఎవరైనా పర్వతాలు ఎక్కుతున్నారంటే ఆసక్తిగా చూసేవాడు. చిన్న వయస్సులోనే పర్వతారోహణంపై ఇష్టం పెంచుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మారుతి.. వ్యవసాయ కుటుంబం కావడంతో బాగా చదువుకోవాలని, పర్వతాలు ఎక్కితే ఏం వస్తుందని చెప్పినా.. పట్టువదలని విక్రమార్కుడిలా స్నేహితులు, గ్రామస్తుల సహకారంతో తల్లిదండ్రులను మెప్పించి అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒక్కటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. మారుతి తండ్రి వ్యవసాయ కూలీ కాగా తల్లి బీడీ కార్మికురాలు. మారుతి స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదివి, ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ హిమాలయ పర్వ తం అధిరోహించడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. పర్వతారోహణ కోసం నల్గొండ జిల్లా భువనగిరిలో శిక్షణ పొందాడు. కిలిమంజా రో అధిరోహించడానికి అవకాశం రావడంతో ఆగస్టు 10న తన ప్రయాణం ప్రారంభించి స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను కిలిమంజారోపై ఎగురవేశాడు. ఇందూరు కీర్తిని చాటిన మారుతిని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సన్మానించి, రూ.50వేల నగదు ప్రోత్సాహం అందజేశారు.
దేశం , రాష్ట్రం కోసం అవకాశం వస్తే మరిన్ని శిఖరాలు అధిరోహిస్తా. నా తల్లిదండ్రులు రూ. 3లక్షలు తీసుకువచ్చి ప్రోత్సహించారు. అమ్మానాన్నలు మొదట్లో వద్దని చెప్పారు. నా ఇష్టాన్ని కాదనలేక డబ్బులు సమకూర్చారు. స్నేహితులు, గ్రామస్తులు చాలా ప్రోత్సహించారు.
– మారుతి