నందిపేట్, నవంబర్ 30: టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ లో చేరుతున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని నాయక్పోడు సంఘం సభ్యులు బుధవా రం ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయక్పోడు సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా పాలిస్తున్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచనా విధానానికి తామంతా ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
నేడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్ అని, ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతుందన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెన్నంటే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించి కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కాకుండా ఏ పార్టీ వచ్చినా.. ఉచిత పథకాలకు ఉప్పు పాతర వేస్తారని, పేదల నోట్లో మట్టి కొడతారన్నారు. ఎనిమిదేండ్ల తర్వాత తెలంగాణ ద్రోహులు ఎంట్రీ ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఉప సర్పంచ్ కొత్తూర్ భరత్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, పార్టీ నాయకులు ఎర్రం ముత్యం, మన్నె సాగర్, మురళి, గాజుల శంకర్, మన్నె శ్రీను తదితరులు పాల్గొన్నారు.