రామారెడ్డి/విద్యానగర్, డిసెంబర్15 : సెల్ఫోన్ కోసం వెళ్లి బండరాళ్ల మధ్య చిక్కుకు పోయిన రాజు మృత్యుంజయుడిగా నిలిచాడు. 48 గంటల పాటు నరక యాతన అనుభవించినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించడంతో సురక్షితంగా తిరిగొచ్చాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం బండరాళ్ల నడుమ చిక్కుకు పోయిన సంగతి తెలిసిందే. అతడ్ని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం తరలి వచ్చింది. 43 గంటల పాటు తీవ్రంగా శ్రమించి, రాజును సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. స్వల్పంగా గాయపడిన బాధితుడ్ని కామారెడ్డి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఫోన్ కోసం వెళ్లి..
రాజు స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం కన్నాపూర్ అటవీ ప్రాంతలో గల పులిగుట్ట వద్దకు వేటకు వెళ్లాడు. అయితే, సెల్ఫోన్ జారి, గుట్టపై గల బండరాళ్ల నడుమ పడడంతో దాన్ని తీసేందుకు రాజు వెళ్లాడు. అయితే, ద్వారం సన్నగా ఉండడంతో రాజు తలకిందులుగా చిక్కుకు పోయాడు. అతడ్ని బయటకు లాగేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి వెళ్లి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో పోలీసు, ఫైర్, రెవెన్యూ, ఫారెస్ట్, వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు.
బ్లాస్టింగ్ చేసి, రాళ్లు తొలగించి..
రాజును సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. జేసీబీ సహాయంతో మట్టి, చిన్న చిన్న రాళ్లు తొలగించారు. కానీ, రాజు చిక్కుకున్న భారీ బండరాళ్లను తొలగించడం సాధ్యం కాలేదు. చివరకు ఉప్పరి వారి సహాయంతో బ్లాస్టింగ్ చేయాలని నిర్ణయించారు. మధ్య మధ్యలో సహాయక చర్యలకు విరామం ఇస్తూ, రాజుకు నీళ్లు, జ్యూస్ వంటి ద్రవ పదార్థాలను అందించారు. చివరకు జిలెటిన్ స్టిక్స్ ద్వారా ఏడుసార్లు స్వల్ప తీవ్రతతో పేలుళ్లు జరిపి బండరాళ్లను తొలగించారు. దాదాపు 20 గంటలకు పైగా రాత్రింబవళ్లు శ్రమించిన అధికారులు.. చివరకు గురువారం మధ్యాహ్నం సమయంలో రాజును సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్వల్పంగా గాయపడిన అతడ్ని డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి హుటాహుటిన కామారెడ్డి దవాఖానకు తరలించారు.
రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించిన ఎస్పీ..
ఎస్పీ శ్రీనివాస్రెడ్డి సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు. గురువారం ఉదయమే పులిగుట్ట వద్దకు చేరుకున్న ఆయన.. రెస్క్యూ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించారు. గుహలో ఇరుక్కున్న రాజుతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, క్షేమంగా బయటికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. రాజును క్షేమంగా తీసుకొచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
సంతోషంలో రాజు కుటుంబం..
దాదాపు ఒక రోజంతా సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిసింది. రాజును ప్రాణాలతో తీసుకురావడంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగి పోయారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు శ్రమించిన ప్రతి ఒక్కరికీ, ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు, రాజు సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు, సిబ్బంది కూడా ఆనందంలో మునిగి పోయారు. 20 గంటలకు పైగా పడిన కష్టాన్ని మరిచి పోయి, సంతోషంతో వెనుదిరిగారు. ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి గోపాల్రావు, ఎంపీపీ దశరథ్రెడ్డి, జడ్పీటీసీ మోహన్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్, ఎంపీవో సవితారెడ్డి, వైద్యాధికారులు సంతోష్, షాహీద్అలీ, రాముగౌడ్, హరీశ్గౌడ్, ఎఫ్ఎస్వో పవన్, ఇతర అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నిలకడగా ఆరోగ్యం..
కామారెడ్డి దవాఖానలో చికిత్స పొందుతున్న రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. స్వల్పంగా గాయపడిన అతడికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.ఎలాంటి ప్రాణాపాయం లేదని, 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి తెలిపారు. గుహలో ఉన్నప్పుడు డీహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్, పండ్ల రసాలను పైపు ద్వారా ఇచ్చినట్లు వివరించారు. బాధితుడికి ఎలాంటి గాయాలు కాకుండా, అతి కష్టమ్మీద బండరాళ్లను పగులగొట్టి క్షేమంగా బయటికి తీసుకొచ్చినట్లు చెప్పారు.
పునర్జన్మను ఇచ్చిన్రు..
నా భర్త 48 గంటలు రాళ్లల్ల చిక్కుకుని నరకయాతన పడిండు. ఆయన కోసం రెండు రోజుల సంది నిద్ర లేకుండా గడిపినం. రాజును బతికించేందుకు అధికారులంతా కష్టపడిండ్రు. కంటి మీద కునుకు లేకుండా పని చేసిన్రు. నా భర్తకు కలిసి పునర్జన్మను ఇచ్చిన్రు. అందరికీ తల వంచి నమస్కరిస్తున్న.
– లక్ష్మి, రాజు భార్య
ధైర్యం చెప్పిన..
రాజును బతకించేందుకు అధికారులంతా బాగా కష్టపడ్డారు. వారి సూచన మేరకు రాజుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ధైర్యం చెప్పిన. అధికారులు వచ్చిన్రు, నిన్ను బతికిస్తారని చెప్పిన. దాదాపు 30 సార్లు రాజు వద్దకు కష్టంగా వెళ్లి నీళ్లు, జ్యూస్ ఇచ్చి వచ్చిన. రాజును కాపాడిన అధికారులకు కృతజ్ఞతలు.
– అశోక్, రాజు మిత్రడు