నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి కుమారుడిని హత్య చేశాడనే కక్షతోనే కత్తితో దాడిచేశాడని ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. నిందితులకు నేర చరి త్ర ఉన్నదని, వారు ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చారని చెప్పారు. ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కత్తిపోట్ల ఘటనకు సంబంధించిన వివరాలను కిరణ్కుమార్ వెల్లడించారు.
నగరంలోని నిర్మల హృదయ పాఠశాల చౌరస్తా వద్ద ఈ నెల 16న మానే శివ కుమార్ అనే యువకుడిపై ఇద్దరు బైక్పై వచ్చి కత్తితో పొడిచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మూడోటౌన్ ఎస్సై శ్రావణ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులు బోధన్ పట్టణం శక్కర్నగర్కు చెందిన షాపురం గోపి అలియాస్ చాట్ల గోపి, మేడ్చల్ మండలం గూండ్ల పోచంపల్లి గ్రామానికి చెందిన మన్నె ప్రకాశ్ను ఆదివారం రాత్రి నగరంలోని హమాల్వాడి చౌరస్తాలో అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు శివకుమార్పై దాడి చేసినట్లు అంగీకరించారు. నిందితుడు గోపి కుమారుడు చాట్ల శివను గత జనవరిలో మానె శివకుమార్ మరో నలుగురితో కలిసి బోధన్లో హత్య చేశాడని, అందుకే అతడిపై కక్షగట్టి హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు ఏసీపీ వివరించారు. శివకుమార్పై హత్యా యత్నం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, రెండు సెల్ఫోన్స్, బైక్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నిందితులు పాత నేరస్థులు..
కత్తిపోట్ల కేసులో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు పాత నేరస్థులని ఏసీపీ తెలిపారు. గోపిపై 17 దొంగతనాలు, మర్డర్, కిడ్నాప్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. మరో నిందితుడైన మన్నె ప్రకాశ్పై ఆరు కేసులు ఉన్నయాని చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకునేందుకు కృషిచేసిన నగర సీఐ వెంకట నారాయణ, మూడోటౌన్ ఎస్సై శ్రావణ్కుమార్తోపాటు ఏఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుళ్లు ఎండీ అఫ్సర్, వెంకట్రామ్ను ఏసీపీ అభినందించారు.