మెండోరా, మార్చి1: సుప్రీం కోర్టు తీర్పు మేరకు మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఎస్సారెస్పీలోకి నీటిని విడుదల చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్టు గేట్లను పైకెత్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో 80 కిలోమీటర్ల దూరంలో ధర్మాబాద్ సమీపంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర సర్కార్ నిర్మించింది. దీంతో ఎస్సారెస్పీలోకి వచ్చే వరదకు స్వల్పంగా అడ్డుకట్ట పడింది. రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రతి సంవత్సరం మార్చి 1న తాగు నీటి అవసరాల కోసం దిగువకు 0.6 టీఎంసీలతోపాటు జూలై 1నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు వానకాలం సీజన్ మొత్తం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు బుధవారం గేట్లను దిగువకు నీటిని విడుదల చేశారు. జూలై1న తిరిగి బాబ్లీ గేట్లను ఎత్తుతారని అధికారులు తెలిపారు. కా ర్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ఎన్.శ్రీనివాస్రావు, నాందే డ్ ఈఈ ఏఎస్ చౌగ్లె, నాందేడ్ డీఈఈ ఆర్ఆర్ పోటేదార్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ వంశీ పాల్గొన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.07 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో ఇం దులో నుంచి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసి తిరిగి గేట్ల ను మూసివేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నీటి విడుదల బుధవారం అర్ధరాత్రి వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుకునే అవకాశముందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టడంతో ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు, పర్యాటకులు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ శ్రీనివాస్ సూచించారు. ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 300, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 150, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 792, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1077.10 అడుగులు 44.95 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.