మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు పోటెత్తాయి. చివరి రోజు దండిగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కరోజే నిజామాబాద్లో 2028, కామారెడ్డిలో 695 అప్లికేషన్లు రావడం విశేషం. నోటిఫికేషన్ వెలువడిన మొదట్లో పెద్దగా టెండర్లు రాలేదు. అయితే, గురువారం నుంచి శ్రావణమాసం ఆరంభం కావడంతో వ్యాపారులు వరుస కట్టారు. ఇక, శ్రావణంలో తొలి శుక్రవారం కావడంతో చివరిరోజు వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన టెండర్ల స్వీకరణ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. శ్రావణ శుక్రవారం కావడంతో కొంత మంది మహిళల పేరిట దరఖాస్తులు వేయించారు. షాపుల కేటాయింపునకు ఈ నెల 21న లక్కీడ్రా నిర్వహించనున్నారు.
– కామారెడ్డి (నమస్తే తెలంగాణ), నిజామాబాద్ క్రైం, ఆగస్టు 18
నిజామాబాద్ క్రైం, ఆగస్టు 18 : నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను 102 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం వ్యాపారులు టెండర్లు వేసేందుకు పోటీపడ్డారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ పర్యవేక్షణలో సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు. చివరి రోజైన శుక్రవారం అధికారుల అంచనాలకు మించి టెండర్లు దాఖలయ్యాయి. దీంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆవరణతోపాటు సుభాష్నగర్ పరిసర ప్రాంతాలు లిక్కర్ వ్యాపారులతో కిటకిటలాడింది. ఉదయం 9 గంటలకు మొదలైన అప్లికేషన్ల స్వీకరణ అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాత్రి 11 గంటల వరకు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 790, బోధన్ 279, ఆర్మూర్ 511, భీమ్గల్ 220, మోర్తాడ్లో 228 మొత్తం 2,028 దరఖాస్తులు వచ్చాయి. 11 రోజుల్లో వచ్చిన దరఖాస్తులకు రెండింతలు ఒకే రోజు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు 3,731 దరఖాస్తులు దాఖలయ్యాయి.
రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మొత్తం కన్నా ఈ సారి కొద్దిగా ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే లిక్కర్ వ్యాపారులు అధికారుల అంచనాలను తలకిందులు చేశారు. గతంలో 102 లిక్కర్ షాపులకు మొత్తం1,762 అప్లికేషన్లు వస్తే ప్రస్తుతం రెండింతలు అంటే 3,231 వచ్చాయి. టెండర్ల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ యాసిన్ ఖురేషీ పర్యవేక్షించారు.
కామారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు పోటెత్తాయి. గత మద్యం పాలసీతో పోలిస్తే సుమారు వెయ్యి దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత పాలసీలో జిల్లా వ్యాప్తంగా 984 దరఖాస్తులు వచ్చాయి. 2023-25 సంవత్సరానికి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం శుక్రవారం ఒక్క రోజే రాత్రి 10.30 గంటల వరకు 695 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 2083 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1400 దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేయగా, మరో 500 దరఖాస్తులు అధికంగా రావడం గమనార్హం. జిల్లాలో మద్యం దుకాణాలకు భారీ స్పందన లభించిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్వ్రీంద్ర రాజు తెలిపారు.