కలిసి కట్టుగా ముందుకు సాగాలి. సీఎం కేసీఆర్కు భారీ మెజార్టీ తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. బుధవారం హైదరాబాద్లో కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్చార్జి శేరి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సహా అన్ని మండలాల నాయకులు హాజరైన ఈ భేటీలో.. క్షేత్ర స్థాయి పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టడం, సోషల్మీడియాను సద్వినియోగం చేసుకోవడంపై పలు సూచనలు చేశారు. కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగడంతో పోటీ ఏకపక్షంగానే ఉందని, కానీ భారీ మెజార్టీ కోసం అంతా కష్టపడి పని చేయాలని సూచించారు.
– నిజామాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతానికి చెందిన వారందరితో భేటీ కావ డం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో కామారెడ్డి ప్రాంత ముఖ్య నేతలతో విడివిడిగా మండలాల వారీగా సమావేశం అయ్యారు. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్, దోమకొండ, బీబీపేట, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన వారందరినీ పిలిపించుకొని సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో పరిస్థితులపైనా ఆరా తీశారు. కేసీఆర్ పోటీ చేస్తుండడంతో గెలుపు ఏకపక్షంగానే ఉన్నదని నేతలంతా కుండబద్ధలు కొట్టి చెప్పారు. మెజారిటీ కోసమే శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. మరోవైపు గత బహిరంగ సభలో సూచించినట్లుగా 266 బూత్ కమిటీ ఇన్చార్జీల నియామకం, గ్రామాల వారీగా అవసరాల గుర్తింపుపైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరా తీశారు. కేటీఆర్ పిలుపుతో కామారెడ్డికి ఎన్నికల క్యాంపెయిన్ ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని, సోషల్ మీడియాలో అందరూ చురుగ్గా పాలుపంచుకోవాలని కేటీఆర్ సూచించినట్లు సమాచారం.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీచేస్తున్న నియోజకవర్గం కావడంతో కామారెడ్డిపై అందరి చూపు పడింది. బీఆర్ఎస్ అధిష్టానం సైతం కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. భారీ మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకున్నది. కేటీఆర్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించే పనిలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిమగ్నం అయ్యారు. గ్రామాల వారీగా అవసరాలను నమోదు చేయాలని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లు, వారి ఆశలు, ఆకాంక్షలను పొందుపర్చబోతున్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు నియోజకవర్గాన్ని మేటిగా నిలిపేందుకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో ఎలాంటి సమస్యలు కనిపించకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలో తిరిగి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కావాల్సిన అవసరాలను తీర్చడమే పనిగా పెట్టుకొని బీఆర్ఎస్ కృషి చేస్తున్నది. చెప్పిన మాట ప్రకారం పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా అధిష్టానం ముందుకు సాగుతున్నది. పదేండ్ల కాలం లో చేసిన పనులను చెప్పుకోవడంతోపాటు చేయబోయే కార్యక్రమాలను సైతం ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎంపీ బీబీ పాటిల్ సమీక్షలో పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 266 బూత్లు ఉన్నాయి. వీటికి సీనియర్ నాయకుడిని ఇన్చార్జీగా నియమించి ప్రచారపర్వాన్ని ఉధృతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నది. మొన్నటి కామారెడ్డి సభలోనూ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి బూత్కు పకడ్బందీగా అనుభవం ఉన్న నాయకుడ్ని బాధ్యుడిగా నియమించడం ద్వారా ప్రజల్లోకి సులువుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజలను సమన్వయం చేసుకోవడంతోపాటు శ్రేణులను కలుపుకొని పోవడానికి ఆస్కారం ఉంటుంది. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలున్నాయి. మండలాల వారీగా అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కార్యవర్గాలన్ని ఉత్తేజభరితంగా పని చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్ నొక్కి చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే అబద్ధాలను తిప్పికొట్టేలా సోషల్ మీడియాను బలంగా వాడుకోవాల్సిన అవసరాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బూత్ కమిటీ ఇన్చార్జీల పనితీరు ఎలా ఉండాలన్న దానిపైనా సలహాలు, సూచనలు ఇచ్చారు. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా అనుకున్న మెజారిటీని కేసీఆర్కు అందించ వచ్చని కేటీఆర్ హితబోధ చేశారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీచేస్తున్నట్లుగా ప్రకటించడమే తరువాయి గెలుపు అన్నది ఇక్కడ ఖరారు అయ్యింది. కాకపోతే మెజారిటీ మాత్రమే మిగిలి ఉన్నందునా ప్రాధాన్యత స్థాయిలో ఓట్లు రాబట్టాలనే వ్యూహంలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నం కావడంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతున్నదని, అన్ని అవసరాలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్న విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు.