దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల పింఛన్ పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి మరో రూ.వేయి జత చేయనున్నట్లుగా స్పష్టంచేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రూ.3016 బదులుగా ఇకపై వచ్చే నెల నుంచి రూ.4,116 చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. సమాజంలో విధివంచితులై జీవిస్తున్న దివ్యాంగులకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే భారీ ఎత్తున పింఛన్ పంపిణీ జరుగుతున్నది. అనేక రాష్ర్టాల్లో రూ.వందల్లోనే సాయం అందుతుండగా మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ పరిపాలనలో వారికి రూ.వేలల్లో ఆర్థికసాయం ప్రతి నెలా వచ్చి చేరుతున్నది. గతంలో రూ.1500 చొప్పున అందించిన పింఛన్ 2019 ప్రథమార్థంలో రూ.3వేలకు చేరింది. ఇప్పుడేకంగా రూ.4వేలకు చేరడంతో ఆయా వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. జూలై నుంచి ఈ కొత్త పింఛన్ డబ్బులను జమ చేయబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇంతగా ఆదరించిన ముఖ్యమంత్రులెవ్వరూ లేరని వారంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రూ.1500 నుంచి రూ.4వేల దాకా…
బీఆర్ఎస్ మొదట అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభు త్వం పింఛన్ను పెంచింది. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పింఛన్ను డబుల్ చేసిన సీఎం కేసీఆర్ తా జాగా మరోమారు రూ.4,116 చొప్పున సాయం చే యనున్నట్లుగా వెల్లడించారు. వేలాది మంది అభాగ్యులకు ఎలాంటి హామీ ఇవ్వకున్నప్పటికీ మానవతా హృ దయంతో వారికి కొండంత అండగా నిలిచారు. ఉభ య జిల్లాల్లో 37,347 మందికి దివ్యాంగుల పింఛన్ అందుతుండగా వీరికి ఇకపై రూ.4,116 చొప్పున జూలై నెలలో బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15.37కోట్లు వెచ్చించబోతున్నది. తొమ్మిదేండ్లుగా నిరాటంకంగా అమలవుతున్న పింఛన్లతో ఆయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వృద్ధాప్య, బోధకాలు, వితంతు, బీడీ, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా సమాజంలో నిర్లక్ష్యానికి, చిన్నచూపునకు గురవుతున్న వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాదీపమై వెలుగులు ప్రసాదిస్తున్నది. పింఛన్ అర్హత వయస్సు గతంలో 65 ఏండ్లు ఉండగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్లకు కుదించారు.
ఆనందంగా ఉన్నది..
బాన్సువాడ టౌన్, జూన్ 10: మా కొడుక్కి(స్వర్ణ శివపాల్) పుట్టుకతో రెండు కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. అనేక దవాఖానల్లో చూపించాం. లాభం లేదు అతడు ఇక సరిగ్గా నడవలేడు, నిలబడలేడు అని డాక్టర్లు తేల్చేశారు. రాష్ట్రం రాక ముందు మా కొడుక్కి రూ.500 పింఛన్ వచ్చేది. బాబుకు రోజుకు ఒక గ్లాస్ పాలు తాగించడానికి కూడా సరిపోయేది కాదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రూ.1500లకు పెంచారు. 2018లో ఇచ్చిన మాట ప్రకారం రూ.3016 చేసిండు. ఆరోగ్యమైన ఆహారంతోపాటు అతడి ఖర్చులకు సరిపోయేవి. నిన్న సీఎం కేసీఆర్ మరో వేయి రూపాయలు పెంచుతున్నానని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులందరి తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలని అతడి తల్లి శివరంజని తెలిపింది.
పిల్లల పేరిట జమ చేస్తా..
బాన్సువాడ టౌన్, జూన్ 10: నాకు పుట్టు మూగ, చెవుడు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దివ్యాంగుల పింఛన్ రూ.3016తో నా రోజూవారీ అవసరాలతోపాటు ఇంట్లో నిత్యవసరాలకు సహాయపడేవి. ఇప్పుడు ఇంకో వేయి రూపాయలు అదనంగా పెంచడంతో చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు పెంచిన వేయి రూపాయలను నా పిల్లల పేరిట ప్రతి నెలా జమ చేస్తానని ఆమె మనోభావాన్ని లిఖిత పూర్వకంగా తెలిపింది. మా వైకల్యాన్ని గుర్తించి ఇంత గొప్ప సహాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రుక్మిణి, దివ్యాంగురాలు, బాన్సువాడ
ఎవరిమీదా ఆధారపడం..
బాన్సువాడ టౌన్, జూన్ 10: పుట్టు అంగవైకల్యం కల్గిన నాకు ప్రతి చోటా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నాకు రూ.200 పింఛన్ వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.3016కు పింఛన్ పెంచారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మరో వేయి రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎవరి మీదా ఆధారపడకుండా బతకగలుగుతాం.
– తాటి సాయవ్వ, దివ్యాంగురాలు, బాన్సువాడ