నిజామాబాద్ క్రైం, జనవరి 10: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న తనను క్రీడారంగ చైర్మన్గా తనపై బాధ్యతలు పెట్టిన సీఎం కేసీఆర్కు, ఎల్లవేళలా తనను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సమైక్య పాలనలో క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. మైదానాలు సైతం పందుల దొడ్లు, మురికికుప్పలుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే అని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 12వేలకు పైగా గ్రామాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఒక నిఖత్ జరీన్, మలావత్ పూర్ణ, అజారుద్దీన్, సానియామిర్జా కావాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగం వర్ధిల్లాలని నగదు పురస్కారాలు అందజేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైతే క్రీడారంగం అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం పేరు దేశం, ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఒక్కరి కష్టం, శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ క్రీడా కారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని భారీగా పెంచారని తెలిపారు. ప్రతి క్రీడాకారుడు కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు, బీసీ మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, జిల్లాక్రీడల అధికారి ముత్తెన్న, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కేసీఆర్ సేవాదళ్ అధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి ఏటీఎస్ శ్రీనివాస్, తెలంగాణ జాగృతి అధ్యక్షుడు అవంతిరావు, అలీం, తారిఖ్అన్సారీ, లక్ష్మీనారాయణ, తెలంగాణ శంకర్, న్యాలం కిషన్, శ్రీనివాసరావు, కబడ్డీ కోచ్ ప్రశాంత్, నాయకులు పాల్గొన్నారు.
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి : జడ్పీ చైర్మన్
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని జడ్పీ చైర్మన్ విఠల్రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చాలామంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. క్రీడాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. తండ్రికి తగ్గ తనయురాలని కొనియాడారు. జిల్లాలోని జీజీహెచ్, ఆర్మూర్, బోధన్తోపాటు జగిత్యాల, లైబ్రరీల్లో అన్నదానం చేస్తున్న మానవతావాది అని అన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు.
కవిత.. నిజామాబాద్ అన్నపూర్ణ : మేయర్
ఎందరో అభాగ్యులకు నిత్యం అన్నదానం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ అన్నపూర్ణ అని నగర మేయర్ నీతూకిరణ్ అన్నారు. కరోనా వంటి కష్టస మయంలోనూ ఎందరినో ఆదుకున్నారని అన్నారు. కేసీఆర్ సేవాదళ్ కప్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం :
ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్
ఎమ్మెల్సీ కవిత వెన్నంటి ఉండడంతో నిజామాబాద్ ప్రజలతో అనుబంధం ఏర్పడిందని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతోనే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి ప్రోత్సాహంతో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని అన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే కబడ్డీ పోటీల కోసం ఎమ్మెల్సీ కవిత రూ. 5 లక్షలతో ప్రత్యేక మ్యాట్ అందజేస్తామన్నారని తెలిపారు.
ఆసక్తి ఉన్న జట్లు పాల్గొనాలి..
ఖలీల్వాడి, జనవరి 10 : మూడు రోజులపాటు కొనసాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆసక్తి ఉన్న జట్లు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి రమణారావు, ప్రధాన కార్యదర్శి ఏటీఎస్ శ్రీనివాస్ తెలిపారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. విజేతలకు రూ. 50వేలు, రన్నరప్ జట్టుకు రూ. 30 వేలు, తృతీయ స్థానం సాధించినవారికి రూ.10వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.