నిజామాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఎండాకాలం వచ్చిందంటే పల్లెలను తాగునీటి తిప్పలు వెంటాడేవి. గుక్కెడు నీళ్ల కోసం తండాలు పరితపించేవి. ఆడబిడ్డలు బిందెలు నెత్తిన పెట్టుకుని ఎండలో మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. అదంతా గతం.. ఇప్పుడు నల్లా తిప్పితే కావాల్సినంత జలం.. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ప్రయత్నాలతో ఇంటి ముందరికే ‘గంగ’ నడుచుకుంటూ వచ్చింది. మిషన్ భగీరథ పుణ్యమా అని తాగునీటి గోస శాశ్వతంగా తప్పింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెకూ ఇప్పుడు సురక్షిత తాగునీరు సరఫరా అవుతున్నది. నీటి వసతి లేక గొంతెండిన తండాలకూ శుద్ధ జలాలు చేరుతున్నాయి. మొత్తానికి తాగునీటి తిప్పలు శాశ్వతంగా దూరమయ్యాయి. స్వచ్ఛమైన నీరు నేరుగా ఇంటి గడప ముందుకే మిషన్ భగీరథ రూపంలో వస్తుండడంతో ఆడబిడ్డలకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపరితల నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ అందిస్తుండడంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడినట్లయింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 1681 ఆవాసాలకు నీరు సరఫరా అవుతున్నది.
సమైక్య పాలనలో ప్రజలకు గుక్కెడు మంచి నీళ్లు తాగేందుకు లేకున్నా పట్టించుకున్న వారు మచ్చుకూ కనిపించలేదు. మన ఇంటి ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల పొడవునా రోడ్లెక్కినా ఆదుకున్న వారూ కనిపించలేదు. మంచినీళ్లు మహప్రభో అని చేతులు జోడించి రాజకీయ నాయకులను వేడుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో కనికరించలేదు. వేసవికాలం వచ్చిందంటే చాలు జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై నిత్యం ఖాళీ బిందెలతో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తంచేసేది. ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డగించి తాగునీటి గోసపై నిలదీసేది. ఇప్పుడిలాంటి దుస్థితి మచ్చుకైనా కనిపించకపోవడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమే. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిషన్ భగీరథ పథకానికి బీజం వేసి కొద్ది సమయంలోనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని పూర్తి చేసి నేడు ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. దశాబ్దాల సమస్యలకు చెక్ పడడంతో భగీరథ నీళ్లు ఇంటింటికీ పరుగులు తీస్తూ ప్రజల గొంతు తడుపుతున్నది. బిందెడు నీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్లు దూరం నడవాల్సిన దుస్థితి నామరూపాల్లేకుండా పోయింది. గిరిజన తండా వాసులకు ఊట చెలిమెలే పెద్ద దిక్కయ్యే దుస్థితికి చరమగీతం పాడినట్లు అయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 100 శాతం మేర పనులు పూర్తి చేసుకున్న మిషన్ భగీరథ మూలంగా అనేక సత్ఫలితాలు వస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్లోనూ మంచి నీరు లేక విలవిల్లాడిన గొంతుకలకు ఉపరితల నీటిని శుద్ధి చేసి మిషన్ భగీరథ రూపంలో ఇంటికే పంపిస్తుండడంతో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
ప్రాజెక్టుల నుంచి గడప దాక..
ఉభయ జిల్లాల మిషన్ భగీరథ నీటికి సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే ఆయువుపట్టులా నిలుస్తున్నాయి. సింగూర్ ప్రాజెక్టు నీటి ద్వారా బోధన్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో ఆరు మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలతోపాటు ఎల్లారెడ్డిలోని మూడు మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. సింగూర్ సెగ్మెంట్ పరిధిలో 21 మండలాలకు 819 ఆవాసాలకు నీళ్లు అందేలా ఏర్పాట్లు చేశారు. ఒకటి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 5 బ్రేక్ ప్రెషర్ ట్యాంకులు, 2 సంపులు పూర్తి చేశారు. 518.44 కిలోమీటర్లు పైప్లైన్ పనులు పూర్తి చేశారు.
సింగూర్ రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 0.314 టీఎంసీలకు తగ్గిపోవడంతో 2019 జూన్ 27వ తేదీ నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బల్క్ వాటర్ విడుదల నిలిపి వేశారు. తిరిగి 2020 ఆగస్టు 26వ తేదీ నుంచి బల్క్ వాటర్ విడుదల ప్రారంభం కాగా నిరాటంకంగా నీటి సరఫరా కొనసాగుతున్నది. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీటి పథకం వర్తిస్తున్నది. ఈ సెగ్మెంట్ పరిధిలో 12 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, 3 బ్రేక్ ప్రెషర్ ట్యాంకులు, 5 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 23 సంపులు పూర్తి చేశారు. అర్గుల్ వద్ద 60 ఎంఎల్డీ, ఇందల్వాయి వద్ద 40 ఎంఎల్డీ కెపాసిటీతో డబ్ల్యూటీపీ నిర్మాణాలు చేపట్టారు. శ్రీరాంసాగర్ సెగ్మెంట్లో 1547 కిలోమీటర్లు మేర పైప్లైన్ బిగింపు పూర్తయ్యింది. 862 ఆవాసాలకు బల్క్వాటర్ సప్లయ్ ప్రతి రోజూ విజయవంతంగా సాగుతున్నది.
తండాల్లో భగీరథ యత్నం..
సాధారణంగా గిరిజనుల ఆవాసాలన్నీ పల్లె, పట్టణాలకు సుదూరంగా ఉంటాయి. జనావాసాలకు విసిరేసినట్లుగా అడవుల్లో వారంతా జీవనం సాగిస్తుంటారు. గిరిజన తండాలకు భగీరథ నీటిని తీసుకుపోవడం అసాధారణ ప్రక్రియ. ఎత్తు పల్లాలను దాటుకొని, వాగులు, వంకలను లెక్క చేయకుండా శ్రమకోర్చి ప్రభుత్వం పైప్లైన్లను ఏర్పాటు చేసింది. తండాలకు చేరుతున్న భగీరథ జలాల రాకను పరిశీలిస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతున్నది. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని పైప్లైన్ల అమరిక సాగింది. భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించి పైప్లను భూ అంతర్భాగం గుండా వేశారు. దట్టమైన అడవులు, కాలువలు, కెనాళ్ల మీదుగా ఇనుప వారధులను నిర్మించి వాటి గుండా పైప్లను అమర్చారు. ఇటు కెనాల్ నిర్మాణాలు, అటు భగీరథ పైపులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గ్రావిటీ ఆధారంగా నీళ్లను పంపే చోట్ల ఎత్తు పల్లాలను సముద్ర మట్టంతో బేరీజు వేసుకుంటూ ముందుకు పోయారు. గుత్తేదార్లు భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందించి గుట్టలపై సాహసోపేతంగా భారీ నిర్మాణాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 15వందలకు పైగా తండాలకు శుద్ధ జలం చేరుతుండడం విశేషం.
మిషన్ భగరథతో నీటి సమస్య తీరింది..
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి రోజూ నీటి సరఫరా జరుగుతున్నది. గతంలో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. మోటర్లు కాలిపోతే నీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. నేడు నీటి కొరత లేకుండా పోయింది. నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు.
పక్కాగా తాగునీటి సరఫరా..
ఉమ్మడి జిల్లాలో పక్కాగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేశాం. ఉదయం 6.30 గంటలకే ఏఈలు గ్రామాల్లో తిరుగుతున్నారు. సమస్యలుంటే గుర్తించి వెనువెంటనే పరిష్కరిస్తున్నాం. నిరంతరం తాగునీటిని అందిస్తున్న పథకం మరొకటి ఈ దేశంలో లేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలు, పట్టణాలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు ఇంటికే చేరుతుండడం గొప్ప విషయం. శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పెరగడంతో నీటి కొరత లేకుండా పోయింది.
– రాజేంద్రకుమార్, మిషన్ భగీరథ, ఎస్ఈ(ఉమ్మడి నిజామాబాద్ జిల్లా)