ఖలీల్వాడి, మే 31: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల రాక కోసం బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడకుండా ఉండేందుకు ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్-టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నది. ఐ-టిమ్స్, జీపీఎస్ టెక్నాలజీతో అనుసంధానమై ఉండడంతో బస్సుల రాకపోకల సమయంతోపాటు బస్సులో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి, సమీప బస్టాండ్కు ఎంత సమయంలో బస్సు చేరుతుందనే వివరాలు ముందుగానే ప్రయాణికులకు తెలియజేస్తారు. దీంతో బస్టాండ్లలో ప్రయాణికుల సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
15 నిమిషాల ముందే రిజర్వేషన్..
ఆర్టీసీలో దూర ప్రాంత సర్వీసులకు బస్సు బయల్దేరేందుకు గంట ముందే ఆన్లైన్ రిజర్వేషన్ నిలిపివేస్తున్నారు. ఐ-టిమ్స్తో ఇక ఆ ఇబ్బంది తీరనున్నది. బస్సు మొదటి స్టేజీ నుంచి ప్రారంభమైన తర్వాత కూడా ఆ మార్గంలోని తర్వాతి స్టాప్లలో బస్సు ఎక్కదల్చుకున్న ప్రయాణికులు ఆన్లైన్లో 15 నిమిషాల ముందు వరకు కూడా బస్సులో సీట్ల అందుబాటు మేరకు రిజర్వేషన్ చేసుకునే వీలుంటుంది. అన్నింటికీ మించి ప్రయాణికులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఐ-టిమ్స్లో చార్జీలు చెల్లించే అవకాశం ఉన్నది. ఇది స్వైపింగ్ మిషన్లా కూడా పని చేస్తుంది.
త్వరలో ఉమ్మడి జిల్లాలో..
ఐ-టిమ్స్ మిషన్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐ-టిమ్స్ ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. దూర ప్రాంత ప్రయాణాల్లో వినియోగిస్తున్నది. తర్వలోనే అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో 403 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 19 ఉండగా.. గరుడ ప్లస్ 8, రాజధాని 22, సూపర్ లగ్జరీ 45, డీలక్స్ 10, ఎక్స్ప్రెస్లు 104, పల్లె వెలుగు 202, మినీ పల్లె వెలుగు బస్సులు 12 ఉన్నాయి.
మిషన్లు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం..
ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ వినూత్న సేవలను ప్రారంభిస్తున్నది. ఐ-టిమ్స్ మిషన్లు వచ్చిన వెంటనే జిల్లాలో సేవలను ప్రారంభిస్తాం. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు, క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించే వారికి సమయం వృథా కాకుండా ఐ-టిమ్స్ మిషన్లతో మేలు జరుగుతుంది.
– ఉషా దేవి, రీజినల్ మేనేజర్