లెక్కకు మించిన స్కానింగ్ కేంద్రాలే కారణం
ఆడబిడ్డలు పుడితే రోడ్లపై వదిలేస్తున్న కర్కోటకులు
నియంత్రణ లేక ఇష్టానుసారంగా లింగ నిర్ధారణ పరీక్షలు
తెరవెనుక కొంతమంది ప్రైవేటు వైద్యుల సహకారం
కండ్లు తెరవకపోతే స్త్రీ, పురుష నిష్పత్తిలో అసమతుల్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు అతివల విజయపరంపర ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే.. మరోవైపు ఆడపిల్లల పుట్టుకపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తేచాలు గర్భంలోనే చిదిమేస్తున్నారు. 1994లోనే అన్ని దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తీసుకొచ్చాయి. అయినప్పటికీ డబ్బులకు కక్కుర్తిపడి కొందరు వైద్యులు అడ్డదారుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతోపాటు భ్రూణహత్యలకు కారణమవుతున్నారు. అధికార యంత్రాంగం అలసత్వంతో చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బోధన్లో వెలుగుచూసిన ఓ మృత శిశువు… అమ్మాయే కావడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాలికలపై చిన్నచూపు, ప్రజల్లో అవగాహనారాహిత్యం తదితర కారణాలతో గర్భవిచ్ఛిత్తికి సిద్ధమవుతున్నారు. అర్హతలేని స్థానిక వైద్యులు, దవాఖానల సహకారంతో గ్రామీణజనం లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.
అతి పిన్న వయసులో ఎవరెస్టు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ అమ్మాయే. పీవీ సింధూ, సైనా నెహ్వాల్, సానియా మీర్జా ఇలా చెప్పుకుంటూ పోతే క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న వా రంతా అమ్మాయిలే. ఇలా ఒక్కటేమిటి…? అన్ని రంగాల్లో మహిళలు ఖ్యాతినార్జిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చంపేసే దుష్ట సంస్కృతి నేటికీ కొనసాగుతున్నది. అమ్మాయి అని తెలిస్తే పలు కారణాలతో గర్భంలోనే తొలగిస్తున్న సంఘటనలు సభ్య సమాజానికి తలవంపులు తెస్తున్నా యి. ఓ వైపు అన్ని దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించినా… అదనపు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు అడ్డదారుల్లో కేంద్రాలు నడుపుతూ శిశువుల ఊపిరి తీసేందుకు దోహదపడుతున్నారు. ఇలాంటి వాటి ని నియంత్రించాల్సిన జిల్లా అధికార యం త్రాంగం, వైద్యారోగ్య శాఖలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. తాజాగా జనవరి 12న బోధన్లో వెలుగు చూసిన ఓ మృత శిశువు… అమ్మాయే కావడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నది.
నీచ సంస్కృతి…
అన్ని దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తూ 1994 లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయి. అయినప్పటికీ జిల్లాలో ఈ పరీక్షలు అడ్డదారుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాలికలపై చిన్నచూపు, ప్రజల్లో అవగాహనారాహిత్యం తో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు పుట్టబోయేది అమ్మాయి అని తెలిస్తే చాలు గర్భంలోనే తొలగించే నీచ సంస్కృతిని విడనాడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఇంకా తొలగిపోని కారణంగా గర్భిణులు పలువురు అర్హతలేని స్థానిక వైద్యులు, దవాఖానల సహకారంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. గర్భంలోని శిశువు ఆడ, మగ అన్నది చెప్పరాదని కేంద్రం పి.ఎన్.డి.టి. చట్టం 1994 తీసుకు వచ్చింది. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్న వైద్యులు, పలు ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు ఇష్టానుసారంగా లింగ నిర్ధారణ పరీక్షలకు మొగ్గు చూపుతున్నారు. గుట్టుగా ఎవరికీ తెలియకుండానే చెవిలో సమాచారం చేరవేస్తూ భూమిపై కండ్లు తెరవాల్సిన శిశువులు… అమ్మ గర్భంలోనే కండ్లు మూయాల్సిన దుస్థితికి కారణం అవుతున్నారు.
మధ్యవర్తులతో దందా…
బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా… అవగాహనారాహిత్యంతో ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మరో వైపు బాలికల సంరక్షణ కోసం చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతుందన్న అపవాదు నెలకొన్నది. జిల్లా లో పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా భ్రూణ హత్యలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నది. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణకు జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా, డీఎంహెచ్వో కన్వీనర్గా, జిల్లా న్యాయమూర్తి, ఎన్జీవో ప్రతినిధి, ఎస్పీ సభ్యులుగా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులిచ్చేటపుడు ఈ కమి టీ సభ్యుల్లోని కొందరు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి పరిశీలించడం తప్ప పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నారు. పలువురు ఆర్ఎంపీ, పీఎంపీలు ఈ విషయంలో పలు దవా ఖానలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. చైతన్యవంతమైన జిల్లాగా పేరున్న నిజామాబాద్లో బాలికలపై వివక్ష కొనసాగుతుండడం విడ్డూరంగా మా రింది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15,182 మంది గర్భవతులున్నారు. 11,514మంది బాలింతలు ఉన్నా రు. 6నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 96వేల 261 మంది ఉన్నట్లుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
వాళ్లపై నిఘా ఎక్కడా…?
జిల్లాలో మాతాశిశు సంరక్షణ కోసం కృషి చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర అనుబంధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. మొదటిసారి కుమార్తెను ప్రసవించి, రెండోసారి గర్భం దాల్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాలి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు సూపర్ వైజర్ల ద్వారా వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉన్నా ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని తెలుస్తున్న ది. గర్భం దాల్చిన తరువాత ఎన్ని సార్లు స్కానిం గ్ తీయించుకున్నారు. ఎక్కడ తీయించుకున్నారు అనే వివరాలు ప్రతి నెలా రికార్డుల్లో పొందుపర్చాలి. దీంతో పాటు స్కానింగ్ కేంద్రాల్లో అర్హత ఉన్న వారే స్కానింగ్ చేస్తున్నారా? ఇతరులు చేస్తున్నారా? అనే వివరాలతో పాటు వారు చేస్తున్న ప్రతి స్కానింగ్ వివరాలు సేకరించి నెల నెలా కార్యాలయంలో పొందు పరిచేందుకు ప్రత్యేక విభాగం పని చేయాల్సి ఉన్నప్పటికీ నిస్తేజమైంది. సమాచారం ఇవ్వని స్కానింగ్ సెంటర్లపై పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేయడం అనుమానాలకు తావిస్తున్నది. నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ప్రైవే టు దవాఖానలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న వైద్యు లు మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లోని వైద్యశాలలపై ఇసుమంతైనా తనిఖీలు లేకపోవడం అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి.
కఠిన చర్యలు తప్పవు…
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే దవాఖానల రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు కేసులు సైతం పెడతాం. జిల్లాలో ఈ పరీక్షల నియంత్రణకు కమిటీ ఉన్నా ఈ విషయంలో తమకు ఫిర్యాదులు రావడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలపై తమకు ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై సత్వర చర్యలు తీసుకుంటాం.
– సుదర్శనం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి