కమ్మర్పల్లి / వేల్పూర్/భీమ్గల్/కామారెడ్డి, మార్చి 18 : సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగులకు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి పేస్కేల్ వర్తించనున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలోని సెర్ప్ ఉద్యోగులు సంబురాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, వేల్పూర్, భీమ్గల్ తదితర మండలాల్లో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, భీమ్గల్లో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న జీవో 11ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
23 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా నామమాత్రపు జీతాలతో పని చేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపజేయడం ఆనందంగా ఉన్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థలో పని చేస్తున్న 3,972 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భీమ్గల్ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, సీనియర్ సీసీలు పురాస్తు నరేశ్, సీసీలు రఘు, భాస్కర్, సెర్ప్ సిబ్బంది ముత్యం, ప్రసాద్ పాల్గొన్నారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులు ఏడెల్లి రవి, మురళి, ప్రకాశం, ప్రవీణ్, రాధ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, ఐకేపీ జిల్లా నాయకులు రాజారెడ్డి, డీపీఎం సుధాకర్, సాయిలు, గంగరాజు, విశ్వనాథ్, అంజాగౌడ్, స్వరూప, నరేందర్ రెడ్డి, బాగయ్య, కృష్ణాంజలి తదితరులు పాల్గొన్నారు.
పేస్కేల్ కల నెరవేర్చారు..
సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడు కావడంతోపాటు మా కష్టాలను మనసుతో చూసిన నాయకుడు కాబట్టే పేస్కేల్ కల నెరవేర్చారు. సెర్ప్ ఉద్యోగుల 23ఏండ్ల పోరాటాన్ని గుర్తించి పేస్కేల్ ద్వారా 4 వేల మంది సిబ్బంది కల నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ది. ఆయనకు జీవితకాలం రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో 50లక్షల మంది మహిళలు పాల్గొనడంలో, స్వరాష్ట్రంలో కేసీఆర్ కలగన్న మహిళా సాధికారత సాధన కోసం 32వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు సాధ్యం చేయడంలో, రుణాల రికవరీని 99 శాతం సాధించడంలో సెర్ప్ సిబ్బంది పడ్డ శ్రమను గుర్తించారనడానికి పేస్కేల్ జీవో నిదర్శనం.
–కుంట గంగారెడ్డి, సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు
కాంట్రాక్టుగానే మిగిలిపోతామని భయపడ్డాం..
మేమంతా కాంట్రాక్టు ఉద్యోగులుగానే మిగిలిపోతామని భయపడ్డాం. కానీ పేస్కేల్ ఇచ్చి మా ఆందోళనను సీఎం కేసీఆర్ దూరం చేశారు. ఆయన దయతో మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లబ్ధి పొందే అవకాశం దక్కింది. పేస్కేల్ వర్తింపుతో ఉద్యోగ గౌరవం అందింది.
–రవి, సెర్ప్ సీసీల యూనియన్ జిల్లా అధ్యక్షుడు
ఆర్థిక భరోసా కల్పించారు..
చాలీచాలని వేతనాలతో 23సంవత్సరాలుగా బతుకులు నెట్టుకొస్తున్న సెర్ప్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పేస్కేల్ జీవో ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించింది. మహిళా సంఘాల సేవలో ఉన్న సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లబ్ధి, గౌరవం కల్పించిన కేసీఆర్ సార్ మేలును మరువలేం. మాకు సీఎం కేసీఆర్పై ఉన్న నమ్మకం వమ్ము కాలేదు.
–మాణిక్యం, సెర్ప్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు
సంతోషం కలిగించే విషయం..
సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ జీవో ఇవ్వడం హర్షణీయం. మహిళా సంఘాల ఆర్థిక పురోభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో సెర్ప్ సిబ్బంది అంకిత భావంతో కూడిన శ్రమను మహిళా సంఘాల సభ్యులు స్వయంగా చూస్తున్నారు. అందుకే సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేయడం మహిళలకు సైతం సంతోషకరమైన విషయం.
–లావణ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు,కమ్మర్పల్లి మండలం