నిజామాబాద్ క్రైం, మార్చి 31: నిజామాబాద్ మెడికల్ కళాశాలలో సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన తల్లికి మెస్సేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీ ప్రిన్సిపల్ ఇందిర, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా చంద్రకాలనీకి చెందిన మోసం సనత్ (22) నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. గురువారం రాత్రి అందరితో సరదాగా గడిపిన అతడు భోజనానంతరం హాస్టల్లోని తన గదికి వెళ్లిపోయాడు. అయితే, శుక్రవారం ఉదయం గది నుంచి బయటికి రాలేదు. టిఫిన్ చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు వచ్చి ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థులు ప్రిన్సిపాల్ ఇందిరకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, ఇదే విషయంపై ప్రిన్సిపల్ వన్టౌన్ పోలీసులకు ఫోన్ చేయడంతో ఎస్హెచ్వో విజయ్బాబు తన సిబ్బందితో హాస్టల్కు చేరుకున్నారు.
తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా, సనత్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అతడి ఫోన్ను పరిశీలించగా, చదువు విషయంలోనే ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున తన తల్లికి చివరిసారిగా వాట్సాప్ మెస్సేజ్ చేశాడు. మార్చి 9 నుంచి ఎంబీబీఎస్ పరీక్షలు ప్రారంభం కాగా, ఫార్మా ఎగ్జామ్ (11వ తేదీన) ముగిసిన రోజే తాను ఇలా చేసుకోవాలనుకున్నానని, కానీ ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో ఇప్పటివరకూ ఆగినట్లు తన తల్లికి మెస్సేజ్ పంపిన సనత్ అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘మమ్మీ, డాడీ, అన్నయ్య సారీ. నేను ఇలా చేద్దామని ఫార్మా పేపర్-1 అయినాక అనుకున్న. కానీ, ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతారనే చేసుకోలేదు. సాయి.. నువ్ యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపో..’ అని మెస్సేజ్ పెట్టాడు. ఈ విషయం తెలిసి విద్యార్థులు కన్నీటిపర్యమంతయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ తరలి వచ్చారు. సనత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.