ఖలీల్వాడి, మార్చి 15 : ప్రపంచంలోని ప్రతివ్యక్తీ వినియోగదారుడేనని డీఎస్వో వెంకటేశ్వరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వినియోగదారుల సమాచార కేంద్రం కార్యాలయంలో చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అధ్యక్షతన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తమాన డిజిటల్ మార్కెట్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సమస్యలపై చర్చించారు. న్యాయసేవా సహకార సంస్థ లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి ఉచితంగా న్యాయసేవలు అందిస్తున్నదని, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నించినప్పుడే వినియోగదారులు తమ హక్కులు తెలుసుకుంటారన్నారు. ఏ వస్తువు బాగాలేకున్నా నిలదీసి రిపోర్టు చేయాలన్నారు. నాణ్యత పొందడం హక్కుఅని, కొనుగోలుచేసిన ప్రతి వస్తువుకూ రసీదు పొందాలని సూచించారు. డాక్టర్లు, పెట్రోల్ బంకులు, రైస్మిల్లులు, కిరాణా దుకాణాల్లో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, తూనికలు, కొలతల అధికారి సుజాత్అలీ, వైద్యారోగ్యశాఖ కార్యాలయ అధికారి వెంకటేశ్వర్లు , డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, వినియోగదారుల సమాచార కేంద్రం సభ్యులు నారాయణ, నర్సింగ్రావు, గోవర్ధనాచార్యులు, లక్ష్మణ్, శేఖర్, రంజిత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లోని సివిల్ సప్లయీస్ కార్యాలయంలో వినియోగదారుల హక్కుల పోస్టర్లను సివిల్ స్లపయీస్ అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా వినియోగదారుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజేశ్వరి, విఠల్రావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో..
తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్.స్వప్న, బి.స్రవంతి ఆధ్వర్యంలో న్యాయకళాశాల సమావేశ మందిరంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ హాజరై సదస్సులో మాట్లాడారు. వినియోగదారులకు సివిల్, క్రమినల్ అధికారాలు ఉంటాయని, వస్తువు కొనగోలు చేయగానే రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.రవీందర్, ప్రొఫెసర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.