బోధన్, ఏప్రిల్ 22: రాష్ట్ర సాధన కోసం బోధన్లో చేపట్టిన దీక్షలు ఉద్యమ చరిత్రలోనే మహత్తర ఘట్టంగా నిలిచాయి. ఏకంగా 1519 రోజులపాటు జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. దీక్షల సమయంలో రెండు సార్లు బోధన్కు వచ్చిన కేసీఆర్.. తన ఉద్వేగపూరిత ప్రసంగాలతో స్ఫూర్తినింపారు. ‘బోధన్లో తెలంగాణ కోసం దీక్షలు చేస్తున్న తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అంటూ నాటి సభల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో.. బోధన్ దీక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటం ఆగదన్న ఉక్కు సంకల్పంతో బోధన్లో తెలంగాణవాదులు ప్రారంభించిన నిరాహార దీక్షలకు చరిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ కోసం సాగిస్తున్న పోరాటం బోధన్లో తెలంగాణవాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఫలితంగా బోధన్ పోరుగడ్డగా మారింది. బోధన్ కేంద్రంగా జరిగిన వివిధ పోరాటాలతోపాటు సుదీర్ఘకాలం కొనసాగిన నిరాహార దీక్షలు జిల్లాలోనే కాదు.. తెలంగాణాలోనే ఓ మహత్తర ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ ఉద్యమకాలంలోనూ, ఆ తర్వాత అనేకసార్లు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కేసీఆర్ బోధన్ దీక్షలను ప్రస్తావించేవారు.
ఈ దీక్షలకు ఉద్యమ నేత అంతటి ప్రాధాన్యత ఇచ్చేవారు. వాస్తవానికి, బోధన్లో జరిగిన దీక్షలు ఏదో మొక్కుబడిగా జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బోధన్ పట్టణంలో నెలా.. రెండు నెలలో కాదు.. ఏకంగా 1519 రోజులపాటు బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. మెదక్ జిల్లా సిద్దిపేట్ దీక్షల తో సమానంగా బోధన్లో తెలంగాణ సిద్ధించేవరకు నిరాహారదీక్షలు జరగడం గమనార్హం. ఈ కారణంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు ఉద్యమనేత హరీశ్రావు బోధన్ దీక్షల గురించి ఇతర ప్రాంతాల్లో తరచుగా ప్రస్తావించేవారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అన్న నినాదంతో రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యావత్తు తెలంగాణాతోపాటు బోధన్ ప్రాంతంలోనూ ప్రకంపన లు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలే దు. ఫలితంగా ఆ ఏడాది నవంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నాటి కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆంధ్రా నాయకులు కుట్రలకు తెరలేపడం, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమాలు నడపడంతో కేంద్ర ప్రభుత్వం అదే నెల 25న తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
దీంతో తెలంగాణవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. బోధన్ ప్రాంతంలో నూ ప్రత్యేక రాష్ట్రం నినాదంతో తెలంగాణవాదు లు, ప్రజలు ఉద్యమబాట పట్టారు. అప్పట్లో ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా ఉన్న పి.గోపాల్రెడ్డి కన్వీనర్గా బోధన్ జేఏసీ ఏర్పాటైంది. 2009 డిసెంబర్ 25న ఈ జేఏసీ ఏర్పాటుకాగా, అదే నెల 28 నుం చి బోధన్ పట్టణంలో తెలంగాణ కోసం నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలు ప్రారంభమైన మర్నాడే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈ నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించడమే కాకుండా బహిరంగసభలో మా ట్లాడారు. 2009 డిసెంబర్ 28న బోధన్ పట్టణంలోప్రారంభమైన ఈ నిరాహార దీక్షలు రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జరిగాయి. ఈ దీక్షలు 1519 రోజులపాటు.. అనగా నాలుగు సంవత్సరాల 17 రోజులపాటు కొనసాగి 2014 ఫిబ్రవరి 23న ముగిశాయి.
రెండుసార్లు వచ్చిన కేసీఆర్..
బోధన్ పట్టణం కేంద్రంగా కొనసాగిన దీక్షలు ఉద్యమనేత కేసీఆర్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిరాహార దీక్షలకు ఏడాది పూర్తయిన సందర్భంగా 2010 డిసెంబర్ 27న కేసీఆర్ బోధన్కు వచ్చారు. ఆ తర్వాత నిరాహారదీక్షలకు రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2011 డిసెంబర్ 28న బోధన్కు సీఎం కేసీఆర్ వచ్చారు. ఆ రోజున దీక్షా శిబిరంలో 731రోజులకు గుర్తుగా 731 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా దీక్షలో కూర్చున్న మహిళలకు పండ్లరసం అందించి దీక్షలను విరమింపజేశారు. బోధన్ నిరాహారదీక్షలకు 500 రోజులు పూర్తయిన సందర్భంలో తెలంగాణ ఉద్యమనేత హరీశ్రావు బోధన్కు వచ్చి బహిరంగసభలో మాట్లాడారు.
బోధన్ తెలంగాణ బిడ్డలకు సలాం కొట్టిన కేసీఆర్..
దీక్షల సందర్భంగా కేసీఆర్ రెండుసార్లు వచ్చినప్పుడు.. బోధన్ ప్రాంత ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రెండు సందర్భాల్లోనూ బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభల్లో స్వయంగా మాట్లాడారు. తన ఉద్వేగపూరిత ప్రసంగాలతో స్ఫూర్తినిచ్చారు. బోధన్ తెలంగాణ బిడ్డలకు అభినందనలు తెలిపారు. ‘బోధన్లో తెలంగాణ కోసం దీక్షలు చేస్తున్న తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’, ‘బోధన్ తెలంగాణ బిడ్డలకు నా సెల్యూట్’ అంటూ నాటి సభల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో.. నాడు తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ బోధన్కు వచ్చిన సందర్భాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
బోధన్ దీక్షలకు కేసీఆర్ స్ఫూర్తిని అందించారు..
బోధన్లో 1519 రోజులపాటు కొనసాగిన నిరాహారదీక్షలను సీఎం కేసీఆర్ పలుసార్లు ప్రశంసించారు. ఇది నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బోధన్ బిడ్డలంతా ఎంతో గర్వకారణంగా భావించేవారు. బోధన్లో జరిగిన నిరాహారదీక్షలకు నాటి తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ ఎంతో స్ఫూర్తిని అందించారు. బోధన్ జేఏసీ కన్వీనర్గా కేసీఆర్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండేవాడిని. కేసీఆర్ అనేకసార్లు బోధన్ దీక్షల గొప్పతనాన్ని చెప్పేవారు.
– పి.గోపాల్రెడ్డి, బోధన్ జేఏసీ కన్వీనర్
బోధన్ అంటే కేసీఆర్కు ఎంతో అభిమానం..
బోధన్లో జరిగిన తెలంగాణ ఉద్యమంపై నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఎంతో ఆసక్తిని చూపేవారు. ఉద్యమ సమయంలో రెండుసార్లు వచ్చినప్పుడు ఆయన ప్రసంగాలను వినేందుకు గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలిరావడం చూశాం. ఉద్యమం అంటేనే కేసీఆర్ అన్నంతగా తన ప్రసంగాలతో తెలంగాణవాదుల్లో ఉత్తేజం నింపారు. బోధన్లో నిరాహారదీక్షలు చేస్తున్న తెలంగాణ బిడ్డలకు ‘శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అంటూ కేసీఆర్ నాడు అన్న మాటలను ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటాం.
– పిల్లకుంట్ల గంగాధర్గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు