కామారెడ్డి, జూలై 17: వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లు నేలకూలాయి. పంటలు నీటమునిగాయి. జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయశాఖ అధికారులు లెక్కతేల్చారు. 102 గ్రామాల పరిధిలో 4,147 మంది రైతులకు చెందిన మొత్తం 7,798 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. అందులో 3,326 ఎకరాల వరి, 1,583 ఎకరాల మక్కజొన్న, 2,528 ఎకరాల సోయాబీన్, 149 ఎకరాల పత్తి, 60 ఎకరాల పెసర, 40 ఎకరాల మినుము, 112 ఎకరాల కందిపంట నీట మునిగినట్లు సర్వేలో తేలింది. లింగంపేట మండలం పర్మళ్ల్ల గ్రామంలో ఆరు ఎకరాల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
మండలాల వారీగా పంట నష్టం వివరాలు..
వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టంపై సిద్ధం చేసిన నివేదికను కలెక్టర్ జితేశ్ పాటిల్కు అందజేశారు. వర్షాల ధాటికి బిచ్కుంద మండలంలో 1,494 ఎకరాలు, జుక్కల్ మండలంలో 292 ఎకరాలు, మద్నూర్ మండలంలో 1,070 ఎకరాలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. బాన్సువాడ మండలంలో 515 ఎకరాలు, బీర్కూర్ మండలంలో 1,170 ఎకరాలు, నస్రుల్లాబాద్ మండలంలో 1,084 ఎకరాలు దెబ్బతిన్నాయి. తాడ్వాయి మండలంలో 531 ఎకరాలు, గాంధారి మండలంలోని 484 ఎకరాలు, సదాశివనగర్ మండలంలో 275 ఎకరాలు, రాజంపేట మండలంలో 881 ఎకరాలు, బీబీపేట మండలంలో రెండెకరాల్లో పంట నీట మునిగింది.
రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణపై నజర్…
వారం రోజులపాటు కురిసిన వానలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రధానంగా పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్, వ్యవసాయం, నేషనల్ హైవేస్ తదితర శాఖలతో సమీక్షలు నిర్వహించారు. వర్షాల కారణంగా ఐదుగురు మృత్యువాత పడగా, ఆస్తి నష్టం, పంట నష్టాలపై వివరాలను సేకరించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన సంఘటన అందరినీ కలచివేసింది.
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి
వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి. పొలాల్లో నిలిచిన వాననీటిని తొలగించి వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలి. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి గ్రామాల వారీగా సర్వే చేశారు. జిల్లాలో పంటనష్టం వివరాలను పూర్తిగా సేకరించి కలెక్టర్కు అందజేశాం.
-భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి, కామారెడ్డి
అంచనాలు సిద్ధం చేశాం..
భారీ వర్షాలకు జిల్లా నష్టం వివరాలను శాఖల వారీగా సేకరించాం. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు కోసం అంచనాలు సిద్ధం చేశాం. పంటనష్టంపై వ్యవసాయశాఖ నివేదికలు అందించింది. వానకాలంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతుతోపాటు గ్రామాల మధ్య కనెక్టివిటీ కోసం యుద్ధప్రాతికదికన చర్యలు చేపడుతున్నాం.
-జితేశ్ పాటిల్, కలెక్టర్, కామారెడ్డి