నిజామాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు రోజులు.. ఆగని వానలు.. భారీ వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. దంచికొడుతున్న వానలతో మంజీర మళ్లీ ఉప్పొంగింది. గోదావరి మరోమారు ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్పీలోకి వరద పోటెత్తుతుండడంతో 4.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. చాలా చోట్ల చెరువు కట్టలు తెగి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరంతోపాటు కామారెడ్డి, బోధన్, భీమ్గల్, ఆర్మూర్, బాన్సువాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో పాత ఇండ్లు కూలాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ పోచారం సూచించారు. రెండు జిల్లాల్లో వర్ష ప్రభావంపై మంత్రి వేముల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును బుధవారం సందర్శించిన ఆయన.. వరద పరిస్థితిపై ఆరా తీశారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది.
వరుణుడు దూసిన జల ఖడ్గానికి ఉమ్మడి జిల్లా అతలాకుతలం అవుతున్నది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రకృతి ప్రకోపమా..ఊహించని ఉపద్రవ మా..అన్నట్లుగా ఎడతెరిపినివ్వని వర్షాలతో అంతు చిక్కని పరిస్థితి దాపురించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడి ప్రతాపం కొనసాగుతున్న ది. వారం రోజులుగా వర్షం పడుతూనే ఉన్నది. ని జాంసాగర్ మినహా మిగిలిన ప్రధాన జలాశయా లు, చెరువులు పూర్తిగానిండాయి. అలుగులు పార డం, చెరువు కట్టలు తెగడంతో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల ధాటికి రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచి పోయా యి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చాలా పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఆహారం, నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడుతుండగా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికక్కడ వారి అవసరాలను తీరుస్తూ ఆదుకుంటోంది. నిజామాబాద్, కామారెడ్డి, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లోని శివారు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా శాఖల అధికారులతో సహాయక చర్యలపై ప్రజా ప్రతినిధులు నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు నిరంతరం ఉభయ జి ల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే లు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు వరద ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నారు.
ఆరు రోజులుగా ఇండ్లకే పరిమితం
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బు ధవారం కూడా జిల్లాలో వర్షం దంచి కొట్టింది. ము సురు వీడలేదు. ఉభయ జిల్లాల్లో కొద్దిసేపు జల్లులతో కూడిన వాన, మరికొద్ది సేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తూనే ఉండడంతో వరద అంతకంతకూ పెరిగింది. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రైతులు పొలం పనులు, ప్రజలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్లా పాపలతో కుటుంబాలు ఇంటికే పరిమితమమ్యాయి. వరదల ప్రభావం రహదారులపై తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామీణ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, మున్సిపల్ రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కోతకు గురైన రోడ్లు నామ రూపాల్లేకుండా పోయాయి. తారు రోడ్లు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. ఇక మట్టి రోడ్లు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఊరూరా జల సిరి..
భారీ వర్షాలతో ఊరూరా జలకళ ఉట్టిపడుతున్నది. వరదల ప్రవాహం చెరువుల్ని చేరడంతో అలుగు పారుతూ మత్తడి దూకుతూ సరికొత్త జల శోభ పల్లెల్లో కనిపిస్తున్నది. ముసురుతో కూడిన వాతావరణమే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఆది, సోమవారాల్లో ఒకింత తక్కువ జల్లులు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో మాత్రం ఊహించని స్థాయిలో వర్షం కురిసింది. ఇక గతంలో పడిన వర్షం తాలూకు వరదల హోరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. గొలుసు కట్టు చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువల ద్వారా పలు తటాకాల్లోనూ పూర్తి స్థాయి మట్టానికి జల ధారలు చేరుకున్నాయి. వందల ఎకరాల్లో ఉన్న ఆయకట్టు చెరువులన్నీ దాదాపుగా నిండుకుండలా మారా యి. పెద్ద చెరువుల్లోనూ మొదట్లో మోస్తరుగానే నీళ్లు వచ్చినప్పటికీ ఇప్పుడు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయి. ఏండ్లుగా చుక్క నీరు చేరని తటాకాల్లోకి వరద పోటెత్తుతుండడంతో రైతులు, ప్రజలు సంబురం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కుంటలు, చెరువుల్లో జలసిరుల మూలంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తతతో తప్పిన నష్టం..
వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజల వద్దకు పంపించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా నివారించగలిగారు. దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయి నిజామాబాద్లో ఇద్దరు వ్యక్తులు, కరెంట్ షాకుతో కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రాణ నష్ట నివారణకు క్షేత్ర స్థాయిలో అనుమానం ఉన్న ప్రతి చోటా జనాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నది. వరద ప్రభావిత ప్రాం తాలకు ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు. సుదూరాలకు సైతం ప్రజా రవాణా ఆపేయడం ద్వారా జన సంచారాన్ని తగ్గించారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఉపయుక్తమైంది. రాష్ట్రంతో పాటుగా పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా ఎగువ నుంచి వివిధ రూపాల్లో వస్తోన్న వరదను ఇరిగేషన్ ఇంజినీర్లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.