మెండోరా, జూలై 13 : భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కలెక్టర్ సహా అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం సాయంత్రం ఎస్సారెస్పీని సందర్శించి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోలను పరిశీలించారు. వరద ప్రవాహం, గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న నీటి వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ నుంచి గోదావరిలోకి వరద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి వరద ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో 6లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డ్యామ్ కింద గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు గోదావరి వైపు వెళ్లవద్దని అన్నారు. గోదావరిలో వ్యవసాయ మోటర్ల కోసంరైతులు వెళ్లవద్దన్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిక్షత ప్రాంతాలకు తరలించాలని, పునరావాసం కల్పించి భోజన వసతులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన గ్రామాల్లో వెంటనే పునరుద్ధరించాలని ట్రాన్స్కో సీఎండీ గోపాల్రావుకు ఫోన్లో ఆదేశించారు. అనంతరం ఇక్కడి పరిస్థితులను సీఎం కేసీఆర్కు ఫోన్ ద్వారా వివరించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
ఇందూరు, జూలై 13: వర్షాల నేపథ్యంలో అధికారులు తమ కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి అన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్లో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీశారు. ప్రజలు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే 100 లేదా కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. లేదా నేరుగా తనకు కూడా 98668 82244కు ఫోన్ చేయాలన్నారు.