కామారెడ్డి, జూలై 13: వరుసగా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందనీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. గ్రామాల్లో కూలిపోయో దశలో ఉన్న ఇండ్లను గుర్తించి, వాటిలో నివాసం ఉండే వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితే తప్పా..ఇంట్లోనుంచి ప్రజలు బయటికి రావాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటి పారుదల, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ సమస్యలు ఉంటే ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించాలన్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యకార్యకర్తలు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాల్లో గర్భిణులు ఉంటే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం కోసం ముందస్తుగా తరలించే విధంగా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. వరద ముప్పు ఉంటే ఈ ప్రాంతంలో ఇండ్లను ఖాళీ చేయాలని, వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ , పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఏమైనా సమస్యలు వస్తే వెంటనే 08468-220069కు సమాచారం అందించాలని కోరారు. అవసరం అయితే పోలీస్ శాఖకు సంబంధించి 100 డయల్ను అత్యవసరం కోసం వినియోగించుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలను ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిష్కరించామని అన్నారు.
ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 4వేలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 180 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా కూలిపోయినట్లు తెలిపారు. కూలిపోయిన ఇండ్ల వివరాలను గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలో వరదలు రావడంతో 9 చోట్ల రోడ్లను మూసివేసినట్లు వెల్లడించారు. కామారెడ్డిలో విద్యుత్ ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తామని అన్నారు. గ్రామాల్లో వర్షాలు అప్రమత్తంగా ఉండేందుకు వీఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, లైన్మెన్లతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 800 చెరువులు నిండాయన్నారు.
అధికారులతో కలెక్టర్ టెనీకాన్ఫరెన్స్
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయించే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు. గ్రామాల్లో ఉంటూ పంట నష్టంపై సమాచారం అందించాలని అన్నారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వెంకటేశ్ దోత్రె, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీపీవో శ్రీనివాస్ రావు, కామారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.