ఇందూరు, జూలై 13: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపై రాకపోకలను నిలిపివేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ముంపునకు గురైన నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయక్నగర్, బైపాస్ రోడ్డు, న్యూ కలెక్టరేట్, కంఠేశ్వర్, మానిక్బండార్ ఎక్స్ రోడ్డు, అర్సపల్లి, బోధన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ప్రధాన రహదారులపై నుంచి ప్రవహిస్తున్న వరద ఉధృతిని గమనించిన కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్గాల మీదుగా రాకపోకలను అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.
పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు స్థానికంగానే ఉంటూ ట్రాఫిక్ను సురక్షిత ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలని హితవు పలికారు. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో ఉత్తమమని సూచించారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపై ఆగి ఉన్న వరదనీటిని తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థతో పాటు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కరిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున, అత్యవసరముంటే తప్ప ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు.
జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని భరోసా కల్పించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, పశు సంవర్ధక తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇండ్లలో ఉన్న వారికి పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో పునరావాసం కల్పించాలని సూచించారు. వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించామన్నారు. నివాస ప్రాంతాల్లో సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్లకు సమాచారం అందించాలని సూచించారు.