కామారెడ్డి, జూలై 13 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పాత ఇండ్లు కూలిపోతుండగా, రోడ్లు దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 96 గ్రామాల పరిధిలో 6,212 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా 290 ఇండ్లు పాక్షికంగా, 12 పూర్తిగా కూలిపోయాయి. 23 రహదారుల మీదుగా వరద కొనసాగుతున్నది. 8 రహదారుల గుండా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో ఫోన్లో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.
6,212 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సోయాబీన్, పత్తి, వరి, మక్క జొన్న, మినుము, పెసర, కంది పంటలు నీట మునుగుతున్నాయి. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 96 గ్రామాల పరిధిలో 6,212 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు.
102 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, జిల్లా పరిషత్ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. పంచాయతీ రాజ్కు సంబంధించి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 750 కిలోమీటర్లు ఉండగా, 57 కిలోమీటర్ల రోడ్లు వర్షానికి దెబ్బతిన్నట్లు పంచాయతీ రాజ్ శాఖ గుర్తించింది. ఆర్అండ్బీ శాఖకు సంబంధించి 45 కిలోమీటర్ల మేరకు సంబంధించి రోడ్లు ధ్వంసమయ్యాయి.