ఎల్లారెడ్డి రూరల్, జూలై 13: అత్యవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో శ్రీను, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ తహసీల్దార్లు మునీరుద్దీన్, సయీద్తో కలిసి బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో సమీక్షను నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 78 ఇండ్లు కూలిపోయాయని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో చెరువులు, కుంటలు, వాగులు పూర్తిస్థాయిలో నిండినిట్లు పేర్కొన్నారు. పిల్లలకు ఈ వర్షాల్లో చేపలు పట్టడానికి, ఈత కొట్టడానికి పంపవద్దని సూచించారు. అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సత్వర సేవలను అందించాలని సూచించారు. వర్షాల కారణంగా నష్టం వాటిల్లితే ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇరిగేషన్ డీఈఈ, అన్ని మండలాల ఏఈలతో మాట్లాడామని, చెరువులు, కుంటల ద్వారా ప్రమాదాలు జరుగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే.. వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారు సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. శిథిలావస్థకు చేరిన, వర్షపు నీరు నిలిచే ఇండ్లలో ఎవరూ ఉండవద్దని, పునరావాసం చూసుకోవాలన్నారు. లేదంటే అధికారులకు తెలియజేస్తే.. వారు పునరావాసం కల్పిస్తారని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇండ్లు కూలిన పలువురితో మాట్లాడి వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, నాయకులు జంగం నీలకంఠం అప్ప, భూంగారి రాము, శ్రావణ్కుమార్, ముత్తి రామప్ప, పడమటి సం తోష్, అరవింద్గౌడ్, ఎరుకల సాయిలు, సంగని పోచ య్య, ముజ్జూ, ఇమ్రాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.