నిజాంసాగర్, మార్చి 8: రాష్ట్రంలో గుంట భూమి ఎండిపోకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎక్కడో పుట్టిన గోదావరి నీటిని మంజీరలోకి మళ్లించడం చర్రితలోనే ఓ సువర్ణాధ్యాయం. రెండు రోజుల కిందటే కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించే అద్బుత ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సంగారెడ్డి కాలువ తూము గేట్లను ఎత్తి హల్దీవాగులోకి కాళేశ్వరం జలాలను వదిలిపెట్టారు. బుధవారం వర్గల్ మండలంలోని బంధం చెరువు నిండి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మరో పది రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవేశించనుండడంతో ఆయకట్టు రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. పది సంవత్సరాలుగా నిజాంసాగర్ ఆయకట్టు కింద రెండు పంటలకు సక్రమంగా నీరు అందడం లేదు. 2.31 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే నిజాంసాగర్ ప్రస్తుతం 80వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించే స్థితికి చేరుకుంది. ఇందులోనూ రెండు పంటలకు సాగు నీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు వలసలు వెళ్లారు. నేడు కాళేశ్వరం జలాలు నిజాంసాగర్కు చేరనుండడంతో రెండు పంటలకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు
కాళేశ్వరం జలాలు నిజాంసాగర్కు చేరుకునేందుకు మరో పది రోజుల సమయం పట్టనుండడంతో ఆయకట్టు రైతులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. రైతులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగు ద్వారా విడుదల చేసిన జలాలు నాచగిరి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం వద్ద నుంచి మెదక్ జిల్లాలోకి ప్రవేశించి తుప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తాయి. అక్కడి నుంచి మెదక్ జిల్లాలోని సర్దెన, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల మీదుగా నిజాంసాగర్లోకి వస్తుంది. హల్దీవాగు నుంచి నిజాంసాగర్ వరకు 96 కిలో మీటర్లు ఉండగా 39 చెక్డ్యాంలను నింపి నిజాంసాగర్లోకి ప్రవేశిస్తుంది.
ఉమ్మడి జిల్లాకు జలహారతి
కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు రావడంతో ఉమ్మడి జిల్లాకే జలహారతి ఇచ్చినట్లు అవుతుంది. నిజాంసాగర్ ఆయకట్టు కింద గల 2.31 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు త్వరలో నిర్మించతలపెట్టిన నాగమడుగు మత్తడి ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తుంది. ఈ మత్తడికి కాళేశ్వరం నీటిని విడుదల చేసి జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, జుక్కల్, బిచ్కుంద మండలాల్లోని 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించనుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
ముకేశ్పై ఫైన్కు వ్యతిరేకంగా శాట్కు రిలయన్స్!
టెస్టులు, వ్యాక్సిన్ సంఖ్య పెంచాలి