దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన కలెక్టరేట్, పోలీస్ భవనాల నిర్మాణం
ఈ నెల 15లోపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడి
డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కామారెడ్డిలో నూతన భవనాల పరిశీలన
నిజామాబాద్, జూన్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి టౌన్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు సీఎం పర్యటన దాదాపుగా ఖరారు కావడంతో జిల్లా యంత్రాంగం అందుకు సర్వం సిద్ధం అవుతున్నది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలను కేసీఆర్ ప్రారంభించనుండడంతో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ శివశంకర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నూతన భవనాలను శనివారం పరిశీలించారు. వందశాతం నిర్మాణ పనులు, సుందరీకరణ పూర్తి చేసుకున్న కలెక్టరేట్, ఎస్పీ బంగ్లాల వద్ద తుది మెరుగులకు సంబంధించి తీసుకోవాల్సిన అలంకరణ పనుల విషయాలపై ప్రజా ప్రతినిధులు సలహాలు, సూచనలు అందించారు. సరిగ్గా వారం, పది రోజుల్లో సీఎం కేసీఆర్ పర్యటన తప్పక ఉంటుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.
ప్రజల ముంగిటకు పరిపాలన..
ప్రజల వద్దకు పరిపాలనను తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర మంత్రి వేముల అన్నారు. సీఎం ఆలోచన విధానంలో భాగంగా కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాలను కొత్త జిల్లాలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 12 జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలు, పలు జిల్లాలో పోలీస్ కార్యాలయాలు పూర్తి అయ్యాయని తెలిపారు. నూతన కలెక్టరే ట్లు ప్రభుత్వ పరిపాలనకు ముఖ్యకేంద్రంగా నిలిచే విధంగా అత్యాధునికంగా, ప్రజల మేలు కోసం నిర్మించినట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఉంటాయన్నారు. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఒకే రోజులో అన్ని పనులు చూసుకొని వెళ్లొచ్చని చెప్పా రు. నూతన ఎస్పీ కార్యాలయం సైతం లా అండ్ ఆర్డర్ సమస్యలకు గ్రీవెన్స్తో సహా ప్రజల సమస్యలు పరిష్కారానికి వేదికలుగా మారబోతున్నాయని చెప్పారు. ఎస్పీ స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు ఆలకించే పద్ధతి నూతన పోలీస్ కార్యాలయం ద్వారా చేకూరనుందని వివరించారు. ఇలాంటి ఏర్పాటు దేశంలో మరెక్క డా లేదని మంత్రి తెలిపారు.
15లోపు సీఎం రాక..
సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 15వ తేదీలోపు ఉంటుందని మంత్రి వేముల స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్, ఎస్పీ భవనాన్ని 10వ తేదీ నుంచి 15వ తేదీలోపు ప్రారంభం అవుతాయన్నారు. జిల్లా ప్రజలంతా గర్వించే విధంగా కొత్త కలెక్టరేట్, ఎస్పీ భవనాలున్నాయని మంత్రి చెప్పారు. సమీకృత భవనాలు నిర్మించాలనే ఆలోచన కొత్తదని, ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే చేస్తున్నారని తెలిపారు.