శాయంపేట, జూలై 28 : దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని చలివాగు ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆయకట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై నెలన్నర గడిచినా వేల ఎకరాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు. ఓ వైపు దేవాదుల నుంచి భీంఘన్పూర్ ద్వారా చలివాగును గోదావరి జలాలతో నింపుతున్న అధికారులు అక్కడి నుంచి నిరంత రం ధర్మసాగర్ రిజర్వాయర్కు ఎత్తిపోస్తున్నారు. ఎల్ నినో కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చలివాగు ఆ యకట్టుకు నీళ్లు విడుదల కాక భూములు పడావు పడుతున్నా యి.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉన్న చలివాగు నుంచి ధర్మసాగర్కు గోదావరి జలాలు పంపింగ్ చేయడమే కాకుండా పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేట మండలంలోని సు మారు 120 గ్రామాలకు తాగు, వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు కు నీటిని అందిస్తున్నారు. అలాగే అధికారికంగా 3,500, అనధికారికంగా 5వేల ఎకరాల్లో వరి సాగుకు నీరందిస్తున్నారు. గత మే, జూన్ నెలల్లో ప్రాజెక్టులో గోదావరి జలా లు నింపలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం చలివాగు ఆయకట్టు రైతులతో ఇరిగేషన్ డీఈ గిరిధర్, ఏఈ అమృత్ సమావేశం నిర్వహించి వరి సా గుచేయొద్దని, నీళ్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనిపై రైతుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనప్పటికీ చలివాగు ప్రధాన కాల్వ పరిధిలో వరి సాగుకు శ్రీకారం చుట్టారు.

నార్లు పోసుకొని నాటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చలివాగులో 14 క్యూమిక్ల గో దావరి జలాలను భీంఘన్పూర్ నుంచి నిం పుతూ ధర్మసాగర్కు 7 క్యూమిక్లు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే లీకేజీలతో భీంఘన్పూర్ నుంచి కేవలం 7 క్యూమిక్ల నీళ్లు కూడా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 అడుగులు కాగా, ప్రస్తుతం 11 ఫీట్లకు నీరు చేరినట్లు ఏఈ వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని దామరంచపల్లి, రూపురెడ్డిపల్లి, చెన్నాపూర్, పరకాల ప్రధాన కాల్వ కింద తొమ్మిది కిలోమీటర్ల మేరకు భూములన్నీ పడావుపడ్డాయి.
కొద్ది రోజులుగా కాల్వల్లో తక్కువ పరిమాణం లో వదిలిన నీళ్లను ఆదివారం నుంచి బంద్ చేసినట్లు ఏఈ తెలిపారు. దీంతో కాల్వల కింద పోసుకున్న నారు మడులు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎడమ కెనాల్ కింద జోగంపల్లి, పెద్దకోడెపాక, కుడి కెనాల్ కింద కొప్పుల, దామరంచపల్లి, చెన్నాపూర్, పరకాల ఆయకట్టులో 2,200 ఎకరాల్లో వరి సాగుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన కాల్వ చుట్టుపక్కల మాత్రమే వరి సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. వర్షాభావ పరిస్థితుల్లో నాలుగు నెలల పాటు ప్రాజెక్టు నుంచి నీళ్లు అందుతాయా? లేదా? అనే డోలాయమానంలో రైతులున్నారు.