బాన్సువాడ టౌన్, డిసెంబర్ 26: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ..సర్కారు దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లలేని రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలను సమీప దవాఖానల్లోనే కల్పిస్తున్నది. ఇందులో భాగంగా బాన్సువాడ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ఈ సెంటర్ ఏర్పాటుకాగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదే మొదటిది కావడం గమనార్హం. 2018 జనవరి 18న ప్రారంభించినప్పటికీ అన్ని సౌకర్యాలతో చికిత్సను అదే సంవత్సరం మార్చి 24 నుంచి ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 140 మంది రోగులు డయాలసిస్ చేయించుకున్నారు. ఇందులో 91 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 49 మంది వారికి కేటాయించిన రోజుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు.
దవాఖానలో మరో ఐదు బెడ్లు!
బాన్సువాడ డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 5 బెడ్ల తో చికిత్స అందిస్తున్నారు. అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మరో ఐదు బెడ్లు ఏర్పాటు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
కలుషిత నీటితోనే వ్యాధులు
కలుషిత నీరు తాగడంతోనే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. దీంతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా ఇవ్వడంతో పాటు ప్రతి రోజు రెండు పూటల అందిస్తున్నాం. బాన్సువాడ డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 5 బెడ్ల తో చికిత్స జరుగుతోంది. అవసరం మేరకు మరో ఐదు బెడ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– పోచారం శ్రీనివాసరెడ్డి, సభాపతి
జనరేటర్ కూడా ఏర్పాటు చేశాం
2018లో బాన్సువాడ ఏరియా దవాఖానలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ఇక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో 140 మందికి ట్రీట్మెంట్ అందించాం. ప్రస్తుతం 49 మంది డయాలసిస్ రోజు వారీగా తీసుకుంటున్నారు.
– డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్,
బాన్సువాడ ఏరియా దవాఖాన ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు..
దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతో మంది కిడ్నీ రోగులకు ఇక్కడ ట్రీట్మెంట్ అందించాను. బాన్సువాడ నియోజకవర్గం నుంచే కాకుండా పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా డయాలసిస్ కోసం వస్తున్నారు.
– శ్రీహరి, డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్