బోధన్/బాన్సువాడ టౌన్, జూన్ 6: బాన్సువాడ మాతాశిశు దవాఖానలో హెడ్నర్సుగా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ’ అవార్డును ఆరోగ్యజ్యోతి అందుకున్నారు. నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కర్ణాటక న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ అవార్డును ఇచ్చాయి. నర్సిం గ్ వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించడంతోపాటు వ్యక్తిగతంగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆమె చేస్తున్న విశేషకృషికిగాను ఈ అవార్డును అందిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బోధన్ ప్రభుత్వ దవాఖానలో 21 సంవత్సరాలపాటు పనిచేశారు. మూడేండ్లుగా బాన్సువాడ ప్రభుత్వ మాతాశిశు దవాఖానలో హెడ్నర్సుగా సేవలు అందిస్తున్నారు. బోధన్లో ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి గ్రామీణ ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. ఆరోగ్యజ్యోతి అవార్డు అందుకోవడంపై బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్ హర్షం వ్యక్తం చేశా రు. మున్ముందు ఇలాంటి అవార్డులు మరిన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
ఆనందంగా ఉంది..
నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్-2023 అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా సహకరించి ఈ అవార్డు దక్కడానికి ప్రోత్సహించిన బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యులు, నర్సులు, సిబ్బందికి ధన్యవాదాలు. – ఆరోగ్య జ్యోతి, అవార్డు గ్రహీత