నందిపేట్, డిసెంబర్ 25 : మండల కేంద్రంలో ముత్యాలమ్మ, చిలుకల చిన్నమ్మ, అడెల్లి పోచమ్మ ఆలయాల్లో దేవతా విగ్రహాల ఆవిష్కరణ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి హాజరయ్యారు. భక్తులు ప్రత్యేక వాహనంలో హంపీ పీఠాధిపతితోపాటు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో మూడో రోజైన ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.