ఊరూరా పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సర్కారు అడుగులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి కలెక్టర్లు
పోటాపోటీగాస్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
పరిశుభ్రత, పచ్చదనం, మురుగునీటివ్యవస్థ నిర్వహణకు ప్రాధాన్యం
నిజామాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి పండుగకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సిద్ధమైంది. నేటినుంచి పది రోజుల పాటు నిర్వహించనున్న అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. గ్రామాలు, పురపాలికల్లో పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లెలు హరిత శోభను సంతరించు కున్నాయి. ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించి ప్రజలకు సౌకర్యాలు చేరువయ్యాయి. పల్లెప్రగతి స్ఫూర్తితో చేపట్టిన పట్టణప్రగతి కూడా విజయవంతంగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటినుంచి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించేందుకు గ్రామ పంచాయతీలు, పురపాలికలు సిద్ధమయ్యాయి.
పల్లె, పట్టణ ప్రగతితో ప్రజలకు పక్కాగా ఫలాలు అందు తున్నాయి. ప్రారంభ ఆర్భాటాలకే పరిమితం కాకుండా ఆదర్శమైన రీతిలో ప్రయోజనకారిగా మారుతున్నది. ఇందుకు అధికారుల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధుల బాధ్య త తోడవుతున్నది. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. తద్వారా పురపాలికల్లో, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగై ప్రజల ఇక్కట్లు తొలగిపోతున్నాయి. జూలై ఒకటి నుంచి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభం కానున్నది. పది రోజుల పాటు పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించా రు. గత ఏడాది నుంచి అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు విస్తృతంగా జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మెరుగైన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, మొక్కల పెంపకం, పచ్చదనం, వివిధ రకాల సమస్యల పరిష్కారమే లక్ష్యాలుగా నిర్దేశించుకొని పనిచేశారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేటి నుంచి ప్రత్యేక కార్యాచరణతో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గ్రామ పంచాయతీలు, పురపాలికలు సిద్ధమయ్యాయి.
ఏమేమి చేయబోతున్నారంటే..
పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా రహదారులు, మురికి కాల్వలు, ఖాళీ స్థలాలు శుభ్రం చేయించనున్నారు. ఖాళీ స్థలాల్లో, రహదారులు, వీధులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చి వేయించబోతున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్తు స్తంభాలు, తీగలు తొలగించేందుకు ప్రతిపాదించడం, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, నీటి లీకేజీలు గుర్తించి అరికట్టడం, పని చేయని బోరు బావులు, బావులను పూడ్చి వేయనున్నారు. అవసరమైన చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా చైతన్యం తేవడం, కళలు, సాంస్కృతిక, క్రీడా తదితర అంశాల్లో ప్రోత్సహించడంతో పాటు ఇతరత్రా అంశాలు ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. పరిష్కరించదగిన వాటిపై అప్పటికప్పుడు చర్యలు చేపడతారు. అధికార యంత్రాంగం, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు, కౌన్సిలర్లు/కార్పొరేటర్లు, ప్రజలంతా కలిసి సమష్టిగా కృషి చేస్తే పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాలు సైతం పచ్చతోరణాలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా నాటిన మొక్కలకు సంబంధించి సంరక్షణలో ఎదురైన సమస్యలు అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. లెక్కల కోసం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పచ్చని చెట్లతో పంచాయతీల్లో, మున్సిపాలిటీలు ప్రజలకు చక్కని ఆహ్లాదాన్ని అందించే అవకాశం ఏర్పడుతుంది.
తడి, పొడి చెత్తపై నిర్లక్ష్యం..
స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు బ్లూ, గ్రీన్ రంగు ప్లాస్టిక్ బుట్టలను ఉచితంగా అందజేసింది. మొదట్లో ఎంతో ఉత్సాహంగా తడి, పొడి చెత్తను వేరుచేసిన ప్రజలు ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టడం లేదు. బుట్టలను ఇంట్లో ఇతర పనులకు వినియోగిస్తున్నారు. చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లను, ఇతర వాహనాలను పంచాయతీలు సమకూర్చుకున్నాయి. అయితే వాటి వినియోగం కొన్ని చోట్లనే జరుగుతున్నది. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానైనా వాటిని సక్రమంగా వినియోగించేలా ప్రతి పంచాయతీలో తడి, పొడి చెత్త సేకరణ క్రమం తప్పకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పల్లెలు అనగానే ఎక్కిడకక్కడ పేరుకుపోయిన మురుగు నీరే కనిపిస్తుంది. పంచాయతీల్లో సరిపడా సిబ్బంది ఉన్నా… సకాలంలో పనులు చేయడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మురుగును జనావాసాలకు దూరంగా పారదోలితేనే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పనులు చేయించేందుకు ప్రతి పంచాయతీలో కార్యదర్శులున్నారు. పనులు చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నారు. వారికి తోడుగా ఎవరి వీధికి వారే సహకరించుకుని మురుగును తొలగించుకుంటే మన కళ్లెదుటే స్వచ్ఛ త కనిపిస్తుంది. దుర్వాసన దూరం అవుతుంది. సర్కారు ఆశించిన అసలైన ప్రగతి ఫలిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
నిజామాబాద్ జిల్లాలో 530, కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 25లక్షల 49వేల మంది జనాభా ఉన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు, సమస్యలను పరిష్కరించేందుకు 2019 సెప్టెంబర్లో పల్లెప్రగతి ప్రారంభం కాగా రెండో విడుత 2020 జనవరిలో నిర్వహించారు. మూడో విడుత జూన్ 2020లో తలపెట్టారు. అయితే జూలై 1నుంచి నాలుగో విడుత ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం అయ్యారు. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోడవంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. గడిచిన మూడు విడుతల్లో గ్రామాల్లో చాలా ప్రగతి సాధ్యమైంది. గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉంటే చెత్త సేకరణతో పాటు, మొక్కలకు నీళ్లను పట్టించేందుకు ఉంటుందని నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు పూర్తి స్థాయిలో సమకూర్చారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు గాను ఇదివరకే 3 జీపీలకు ట్రాక్టర్లుండగా… ఏడాదిన్నర క్రితం 523 జీపీలకు ట్రాక్టర్లు కొత్తగా కొనుగోలు చేశారు. వీటిలో 513 జీపీల్లో ట్రాలీలు, 526 జీపీల్లో ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థికంగా నిలబడిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు వాహనాలను జీపీ నిధులతో ట్రాక్టర్లను కొనుగోలు చేశాయి. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పంచాయతీలు మాత్రం కలెక్టర్ సా యంతో రుణ రూపేణా ట్రాక్టర్లను తీసుకున్నారు.
ప్రగతి ఫలాలివి..
గ్రామాల్లో గతంలో చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేవారు. ఇప్పుడు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీ సుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్టు షెడ్లు నిర్మించి ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. హరితహారంలో మొక్కలను తీసుకెళ్లడానికి నాటిన వాటికి నీళ్లు పెట్టడానికి వీటిని వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలుతో గ్రామాల్లో పలు సమస్యలు తొలగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలున్నాయి. 529 గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు గాను 521 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లా లో 530 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మించాల్సి ఉండగా… జిల్లా యంత్రాంగం 529 చోట్ల పనులు ప్రారంభించింది. 510 వైకుంఠధామాలను నేటి వరకు పూర్తి చేసింది. కామారెడ్డి జిల్లా 526 జీపీలకు గాను 525 చోట్ల శ్మశానవాటికల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఇందులో 362 చోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన చోట్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడంతో 2019 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బిల్లుల బకాయిల భారం జీపీలకు తీరింది. పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ, సిబ్బం ది వేతనాలు తదితర అవసరాలకు ఫైనాన్స్ కమిషన్ నిధు లు ఉపయోగిస్తున్నారు. వీటికి తోడు పల్లె ప్రకృతి వనా లు సైతం ఊరూరా వెలిశాయి. వీటితో పాటుగా వంద శాతం పన్నుల వసూళ్ల లక్ష్యం సత్ఫలితాలు ఇస్తుంది. ఇది వరకు పరిమితంగా నర్సరీలు ఉండగా ప్రస్తుతం ప్రతీ గ్రామానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలను తీసుకుని నర్సరీలను సిద్ధం చేశారు.