మూడ్రోజుల పండుగ
మంత్రి కేటీఆర్ పిలుపుతో మూడ్రోజులపాటు కార్యక్రమాలు
నేడు భీమ్గల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. మంగళవారం నుంచి మొదలుకొని గురువారం వరకు వరుసగా మూడు రోజుల పాటు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టబోతున్నా రు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ పార్టీ పరంగా వేడుకలకు సిద్ధం అవుతున్నారు. పార్టీ జిల్లా సారథులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ముజీబుద్దీన్ ఈ మేరకు శ్రేణులను సమాయత్తం చేశారు. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ స్వరాష్ర్టాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తులు పంపిణీ చేయనున్నారు. 16వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించబోతున్నారు. 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. గత ఏడాది చేపట్టినట్లుగానే గిఫ్ట్ ఏ స్మైల్ రూపంలోనూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో శ్రేణులు ఈ మేరకు పేదలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
వేల్పూర్,ఫిబ్రవరి14 : రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు వేల్పూర్లోని మంత్రి నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులతో చర్చిస్తారు. మధ్యా హ్నం 1.30 గంటలకు ఈ నెల 17 న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భీమ్గల్లోని బాపూజీ నగర్లో ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమంలో మంత్రి వేముల పాల్గొంటారు.