కామారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను బుధవారం ఓ రైతు నుంచి రూ. 20 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామవాసి తుల సిద్దిరాములుతో పాటు పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూమి, అటవీ శాఖ భూములకు సమీపంలో ఉం ది. అయితే పొలాల్లోకి వెళ్లాలంటే మార్గమధ్యలో వంతెన నిర్మిస్తే వెళ్లడానికి వీలుంటుందని భావించి ఆర్గొండ గ్రామస్తులు కొందరు సొంత డబ్బులతో తాత్కాలిక వంతెన నిర్మిస్తున్నారు. వంతెనలో కొన్ని గజాల భూమి అటవీ శాఖకు చెందినది కావడంతో, అడ్డుకున్న ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్, తనకు రూ.30వేలు ఇస్తే వంతెన నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదించకుండా, అనుమతిస్తానని, అంతకుముందే స్వా ధీనం చేసుకున్న ట్రాక్టర్ను సీజ్ చేయనని చెప్పాడు.
రూ.30వేలు తమతో కాదని, 20వేలు ఇస్తామని సిద్దిరాములుతో పాటు గ్రామస్తులు వేడుకున్నారు. ఎట్టకేలకు రూ.20వేలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని సిద్దిరాములు, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వల పన్నారు. బుధవారం సాయంత్రం కామారెడ్డి బస్టాండ్ సమీపంలో బీట్ అధికారి శ్రీనివాస్ను పిలిపించి, అక్కడ ఫిర్యాదుదారుడు సిద్దిరాములు ద్వారా రూ.20వేలు ఇస్తుండగా, రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. బీట్ ఆఫీసర్ను అదుపులోకి తీసుకొని, అతని వద్దనుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా విచారణలో గతంలోనూ ఫిర్యాదుదారుడు సిద్దిరాములుకు రూ.40వేల విలువ చేసే టేకు తలుపు ఫ్రేమ్ ఇవ్వాలని బీట్ అధికారి శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ను అరెస్టు చేసి కరీంనగర్లోని ఎస్పీ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. ఏ శాఖ అధికారి అయినా లంచం డిమాండ్ చేసిన పక్షంలో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని డీఎస్పీ ఆనంద్కుమార్ కోరారు. ఈ దాడుల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మా గ్రామ శివారులో ఉన్న భూముల వద్ద వర్షపు నీరు వెళ్తుంది. ఆ నీరు వెళ్లడానికి మేం కొందరం కలిసి డబ్బులు జమ చేసుకొని వంతెన నిర్మించుకుంటున్నాం. అయితే బీట్ అధికారి శ్రీనివాస్ వచ్చి ఆ వంతెన పనులు ఆపారు. అది అటవీ భూమి అని, నిర్మించరాదని అడ్డుకున్నారు. ఆ తర్వాత రూ.30వేలు ఇస్తే అనుమతిస్తానని డిమాండ్ చేశారు. మేం 20వేలు ఇస్తామని చెప్పాం. అందుకు ఆయన ఒప్పుకున్నారు. తనకు లంచం ఇవ్వాలని ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం బుధవారం సాయంత్రం కామారెడ్డి బస్టాండ్ వద్ద డబ్బులు ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు.