నిజాంసాగర్, జూలై9: నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించిన సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులు నిండాయి. శనివారం సాయంత్రానికి సింగీతం రిజర్వాయర్లో 416.50 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండగా ఎగువ నుంచి 950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. అంతే స్థాయిలో అలుగు ద్వారా దిగువన ఉన్న మంజీరాలోకి వరద వెళ్తోంది. కళ్యాణి ప్రాజెక్టు 409.50 మీటర్ల పూర్తిస్థాయి నీటితో నిండి ఉంది. ఎగువ నుంచి 770 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తుండగా మూడు వరద గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువన ఉన్న మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 5300 క్కూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పారితే నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో పెరగనుందని ఏఈ తెలిపారు. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1391.98 అడుగులు 4.96 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 405 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని అన్నారు. కళ్యాణి, సింగీతం ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటి విడుదల కొనసాగిస్తామని, మంజీరా పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పోచారంలోకి భారీగా ఇన్ఫ్లో
నాగిరెడ్డిపేట్, జూలై9: పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వస్తోందని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం రాత్రి పది గంటలకు ప్రాజెక్టులోకి 18వేల 085 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 19.8 అడుగుల నీరు ఉన్నట్లు తెలిపారు.